జూపాడుబంగ్లా మహిళ కేరళలో మృతి 

Woman Dies With Husband Harassment Kurnool - Sakshi

భర్తే హత్య చేశాడంటున్న కుటుంబ సభ్యులు

న్యాయం చేయాలని ఆందోళన

జూపాడుబంగ్లా: మండలంలోని మండ్లెం గ్రామానికి చెందిన షేక్‌పర్వీన్‌(32) నాలుగు రోజుల క్రితం కేరళలో మృతిచెందింది. పోలీసులు, మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. జూపాడుబంగ్లాకు చెందిన మహమ్మద్‌షరీఫ్‌ కుమార్తెను మండ్లెం గ్రామానికి చెందిన సయ్యద్‌హయ్యత్‌బాషాకు ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం చేశారు. వివాహ సమయంలో కట్నంగా రూ.4 లక్షలు, 12 తులాల బంగారం, బైక్‌ ఇచ్చారు. సయ్యద్‌హయ్యత్‌బాషా కేరళ రాష్ట్రం మల్లాపురం జిల్లాలోని అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండటంతో అక్కడే కాపురం ఉన్నారు. వీరికి కుమార్తె సంతానం.

ఈ క్రమంలో నాలుగురోజుల క్రితం షేక్‌పర్వీన్‌ ఆరోగ్యం బాగోలేకపోవడంతో అక్కడి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించగా, కోలుకోలేక మృతిచెందింది. మృతదేహాన్ని శనివారం మండ్లెం గ్రామానికి పంపి, సయ్యద్‌హయ్యత్‌బాషా కేరళలోనే ఉండిపోవడంతో అనుమానం వచ్చిన మృతురాలి తల్లిదండ్రులు.. తమ కూతురిని అల్లుడే హతమార్చాడని, అతడు వచ్చేంతవరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని ఆందోళనకు దిగారు. ఎట్టకేలకు సాయంత్రం కేరళ నుంచి మృతురాలు భర్త జూపాడుబంగ్లా పోలీస్‌స్టేషన్‌కు రావడంతో ఎస్‌ఐ రామమోహన్‌రెడ్డి, గ్రామ పెద్దలు కలిసి ఇరుకుటుంబాలతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పి అంత్యక్రియలు పూర్తి చేయించారు.     

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top