దుస్తులు పట్టుకోబోయి.. చెరువులోకి జారి | woman dead body found in pond | Sakshi
Sakshi News home page

దుస్తులు పట్టుకోబోయి.. చెరువులోకి జారి

Feb 2 2018 9:58 AM | Updated on Sep 17 2018 8:02 PM

woman dead body found in pond - Sakshi

మృతి చెందిన అంకమ్మ

నరసన్నపేట: ఎండకు ఆరబెట్టిన దుస్తులు గాలికి ఎగిరిపోవడాన్ని గమనించి వాటిని పట్టుకునేందుకు యత్నించిన ఒక మహిళ ప్రమాదవశాత్తూ చెరువులో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర సంఘటన నరసన్నపేట మండలం జమ్ము శివార్లులోని కోలవానిచెరువు వద్ద గురువారం జరిగింది. బొమ్మాళి అంకమ్మ(48), ఆమె భర్త సింహాచలం రజకవృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సింహాచలం ఆరోగ్యం బాగోలేకపోవడంతో అంకమ్మ ఒక్కరే గురువారం చెరువు వద్దకు వచ్చారు.

వస్త్రాలను ఉతికి ఆరబెట్టారు. ఆరిన దుస్తులను భద్రపరుస్తుండగా ఒక్కసారి గాలివీచింది. మిగిలిన వస్త్రాలు గాలికి ఎగిరిపోవడంతో వాటిని పట్టుకునేందుకు ఆమె ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో చెరువు గట్టుపై నుంచి ఒక్కసారిగా లోపలికి జారిపోయారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో కాపాడలేకపోయారు. తల్లి ఎప్పటికీ ఇంటికి రాకపోవడంతో అనుమానించిన కుమారులు చెరువు వద్దకు వచ్చారు. అక్కడ ఆమె చెప్పులు ఉండటాన్ని గమనించి గాలించగా మృతదేహం లభ్యమైంది. ఈ వార్త తెలిసిన కుటుంబ సభ్యలు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement