
పద్మమ్మ(ఫైల్)
మహబూబ్నగర్ క్రైం: ఆమెకు పెళ్లి అయ్యి.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను ఆటోడ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో ఆటోలో రోజు ప్రయాణం చేయడం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధించి ఏర్పడింది. వీరి బాగోతం రెండు కుటుంబాల్లో తెలిసిందనే భయంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి.. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన శుక్రవారం మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. రైల్వే ఎస్ఐ రాఘవేందర్ కథనం ప్రకారం.. ఇటిక్యాల మండలం వావిలాల గ్రామానికి చెందిన వడ్డె సాయికుమార్(20) శాంతినగర్లోఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. శాంతినగర్కు చెందిన పద్మమ్మ(30) కూలీ పనుల కోసం రోజూ అతని ఆటోలో ప్రయాణం చేసేది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధించి ఏర్పడింది. ఇటీవలే ఇద్దరు ఒకే దగ్గర ఉండగా పద్మమ్మ భర్త బంధువులు పట్టుకున్నారు. ఈ విషయం రెండు కుటుంబాల్లో తెలిసిందనే భయంతో ఈ నెల 28న ఇంట్లో నుంచి ఇద్దరూ పారిపోయి వచ్చి మహబూబ్నగర్లో ఒకరోజు ఉన్నారు. ఆ తర్వాత శుక్రవారం తెల్లవారుజామున రైలు కిం దపడి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి మృతదేహాలకు జనరల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మిస్సింగ్ కేసు నమోదు
శాంతినగర్కు చెందిన వెంకటేష్తో పద్మమ్మకు 15 ఏళ్ల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి పదేళ్ల అమ్మాయి, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. రోజు కూలీ పని చేసే పద్మమ్మ.కు ఆటో డ్రైవర్ అయిన సాయికుమార్తో వివాహేతర సంబంధం ఏర్పడటంతో ఈ నెల 28న ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో భర్త వెంకటేష్ శాంతినగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
గాలించినా ఫలితం లేకుండాపోయింది
సాయికుమార్ మేనమామ జంగయ్య వాళ్లు మహబూబ్నగర్లో ఉన్నట్లు సమాచారం తెలుసుకుని ఒకరోజు మొత్తం వాళ్ల కోసం గాలించారు. శుక్రవారం రాత్రి సైతం రైల్వేస్టేషన్లో పడుకున్నా వారి ఆచూకీ దొరకలేదు. మృతదేహాల దగ్గర దొరికిన సెల్ఫోన్తో రైల్వే పోలీసులు ఫోన్ చేయడంతో అతను జనరల్ ఆస్పత్రికి వచ్చి గుర్తించాడు.

సాయికుమార్(ఫైల్)