ఇంట్లో దాచుకున్న లక్షన్నర నగదు చోరీ

Theft In Kadthal - Sakshi

కడ్తాల్‌(కల్వకుర్తి) : కడ్తాల్‌ మండలం మైసిగండి గ్రామపంచాయతీ పరిధిలోని గానుగుమార్లతండాలో తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి రూ. 1.5లక్షలు దోచుకెళ్లారు. ఎస్సై సుందరయ్య తెలిపిన వివరాల ప్రకారం... గానుగుమార్ల తండాకు చెందిన బాణోతు శంకర్‌ నాయక్‌ బుధవారం ఉదయం యాచారం మండలం తాడిపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో గల తాటికుంట మైసమ్మ అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు.

అమ్మవారి దర్శనం అనంతరం రాత్రి 9గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి చేరుకున్న శంకర్‌నాయక్‌ కుటుంబ సభ్యులు ఇంటి కిటికీ తలుపులు తెరిచి ఉండటం, ఇంట్లో వస్తువులు చిందరవందగా పడి ఉండటంతో ఇంట్లోకి వెళ్లి చూశారు. ఇంట్లోని డ్రెసింగ్‌ టేబుల్‌లో దాచి ఉంచిన రూ. 1.5 లక్షలు మాయం కావడంతో చోరీ జరిగిందని గుర్తించి స్థానిక పోలీసులకు వెంటనే సమాచారం అందించాడు. గురువారం ఉదయం పోలీసులు హైదరాబాద్‌ నుంచి జాగిలంతో పాటు, క్లూస్‌టీం సభ్యులు వచ్చి ఇంటి పరిసరాలతో పాటు, చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి ఆధారాలు సేకరించారు.

సీఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితుడితో మాట్లాడి వివరాలు సేకరించారు. బాధితుడు శంకర్‌నాయక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో సుందరయ్య తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top