సాక్షి, ఒంగోలు: ఒంగోలు ఏఎస్పీ కార్యాలయంలో ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన జరిగింది. జిల్లాలోని పామూరుకు చెందిన చెన్నారపు వెంకటేశ్వర్లుకు చీమకుర్తి మండలం పెద్దచంద్రపాడులో భూమి ఉంది. ఆ విషయమై కొద్ది రోజులుగా బంధువులతో వివాదం నడుస్తున్నది. తన భూమి కబ్జా చేశారని చీమకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో జిల్లా ఎస్పీని కలవడానికి ప్రయత్నించినా కలవనివ్వలేదని వెంకటేశ్వర్లు మనస్తాపానికి గురయ్యాడు. ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి మంగళవారం వెళ్లిన వెంకటేశ్వర్లుకు ఎస్పీ అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో ఏఎస్పీ కార్యాలయానికి వెళ్లిన వెంకటేశ్వర్లు అక్కడ పురుగుల మందు తాగాడు. వెంటనే పోలీసులు గమనించి అతడిని అస్పత్రికి తరలించారు.