రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని దుర్మరణం | Student Died In Road Accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని దుర్మరణం

Apr 12 2018 7:46 AM | Updated on Nov 9 2018 4:36 PM

Student Died In Road Accident - Sakshi

ఘటనా స్థలిలో రాయపురెడ్డి పూజిత మృతదేహం

రామవరప్పాడు (గన్నవరం) : లారీ ఢీ కొట్టడంతో ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన ఎనికేపాడు టంకసాల కల్యాణ మండపం సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. రామవరప్పాడులో రాయపురెడ్డి రమేష్, వనజ దంపతులు తమ ఇద్దరు సంతానంతో కలిసి నివాసం ఉంటున్నారు. రమేష్‌ స్థానికంగా ఇటుకలు, సిమెంట్‌ దుకాణం వ్యాపారం చేసుకుంటున్నాడు. కుమారై పూజిత కానూరులోని వీఆర్‌ సిద్దార్థ కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. కుమారుడు ధనుష్‌ ఇటీవలే తొమ్మిదవ తరగతి పూర్తి చేశాడు. ఎప్పటిలాగానే ఉదయం పూజితను కళాశాలలో దిగబెట్టేందుకు రమేష్‌ ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని బయలు దేరారు.

టంకసాల కల్యాణ మండపం సమీపం నుంచి కానూరు డొంక రోడ్డులోకి వెళ్లేందుకు డివైడర్‌ గ్యాప్‌ వద్ద ఆపారు. అదే సమయంలో గన్నవరం వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి ఆగి ఉన్న వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ చక్రాల కింద పడి నలిగిపోవడంతో తీవ్ర గాయాలై పూజిత అక్కడికక్కడే మరణించింది. తండ్రి రమేష్‌కు స్వల్ప గాయాలవ్వడంతో ప్రయివేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పటమట పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కుటుంబ సభ్యుల అనుమతితో పూజిత కార్నియాలను ఓ కంటి వైద్యశాల డాక్టర్లు సేకరించారు.

వైఎస్సార్‌ సీపీ నాయకుల పరామర్శ
ప్రమాదం గురించి తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ రూరల్‌ మండలాధ్యక్షుడు దేవగిరి ఓంకార్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి యార్కారెడ్డి నాగిరెడ్డి, గ్రామ కన్వీనర్‌ సమ్మెట సాంబశివరావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్నతనం నుంచి  చదువులో ముందుండే పూజితకు అప్పుడే నూరేళ్లు నిండిపోయాయంటూ విలపిస్తున్న తల్లి వనజను ఓదార్చడం ఎవరితనం కాలేదు. జరిగిన ప్రమాదంలో భగవంతుడు తనను తీసుకెళ్లినా బాగుండేదంటూ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించడం చూపురులను కంటతడి పెట్టించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement