ఆనందం... అంతలోనే విషాదం

Sister And Brother Died in Car Accident Hyderabad - Sakshi

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

అల్వాల్‌: కుటుంభ సభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న ఆనంద క్షణాలు మరువకముందే ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. అల్వాల్‌ సీఐ పులి యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం... అల్వాల్‌ బీహెచ్‌ఇఎల్‌ కాలనీలో నివాసముండే వసంతరావు, దీపిక దంపతులకు కుమారుడు సునీల్‌ రాజ్‌వుడ్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సునీల్‌ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగి. ఇతనికి ఐదు సంవత్సరాల ఇద్దరు కవలలు అయాన్, అరప్‌ ఉన్నారు. గురువారం వసంతరావు పెద్ద కూతురు ప్రియదర్శిని బర్త్‌ డే కావడంతో ఆమె పుట్టింటికి వచ్చింది. కుటుంబ సభ్యుల మధ్య వేడుక జరుపుకొంది. అనంతరం ఆమె తన మేనల్లుడు ఆయాన్‌(5)కు తీవ్ర స్థాయిలో జ్వరం రావడంతో రాత్రి 11.30 గంటల ప్రాంతంలో సుచిత్ర దగ్గరిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సునీల్‌రాజ్‌తో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరారు.

ఆసుపత్రికి వెళ్లే తరుణంలో లయోలా కళాశాల ప్రదాన గేటు వద్ద గల రోడ్డు మలుపులో వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొంది. దీంతో రోడ్డుపై పడ్డ ప్రియదర్శిని, అయాన్‌లు అక్కడికక్కడే మృతి చెందగా సునీల్‌రాజ్‌ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే జూమ్‌ కార్‌ సంస్థలో కారున అద్దెకు తీసుకొన్న యువకులు ఏడుగురు ర్యాష్‌ డ్రైవింగ్‌ చేయడంతోనే ప్రమాదం చోటుచేసుకుంది. వీరు అత్యంత వేగంతో బైకును ఢీకొనడంతో పాటు డివైడర్‌ దాటి ఎదురుగా వస్తున్న కారును సైతం ఢీకొట్టారు. డ్రైవర్‌ రాఘవేంద్రచారిని అదుపులోని తీసుకొని  కేసు నమోదు చేశారు. కాగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రియదర్శిని, అయాన్‌ కుటుంబ సభ్యులను మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పరామర్శించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top