వ్యభిచార ముఠా గుట్టురట్టు | She Teams Attack On Brothel House | Sakshi
Sakshi News home page

వ్యభిచార ముఠా గుట్టురట్టు

Apr 4 2018 12:19 PM | Updated on Apr 4 2018 12:19 PM

She Teams Attack On Brothel House - Sakshi

వ్యభిచార గృహ నిర్వాహకులను అరెస్టు చూపుతున్న షీ–టీమ్స్‌ బృందం

కర్నూలు : నగర శివారులోని సంతోష్‌నగర్‌ టీజీవీ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును షీటీమ్స్‌ రట్టు చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం ఉదయం షీ–టీమ్స్‌ ఎస్‌ఐ విజయలక్ష్మి నేతృత్వంలో సభ్యులు దాడులు జరిపారు. నిర్వాహకులు రాజగోపాల్‌ అలియాస్‌ గోపాల్, సైదా అలియాస్‌ రజిత, లక్ష్మీ, ఓ విటుడిని అరెస్టు చేసి వారి నుంచి రూ.3,200 నగదుతో పాటు 7 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బాధితులు కర్నూలుకు చెందిన పావని, అనంతపురానికి చెందిన మంజుల, నల్గొండకు చెందిన ఆండాల్‌కు కౌన్సెలింగ్‌ ఇచ్చి స్వగ్రామాలకు పంపించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు సంబంధించిన వ్యక్తులకు వాట్సాప్‌ ద్వారా అమ్మాయిల ఫొటోలను పంపి వారి అంగీకారంతో ఈ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పంచనామా చేసి నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించగా నిర్వాహకులతో పాటు విటుడు శివను పోలీసులు రిమాండ్‌కు పంపారు. 

రాజగోపాల్‌పై గతంలో కూడా కేసులు...  
ఆళ్లగడ్డకు చెందిన గోపాల్‌ రెండేళ్లుగా కర్నూలులో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నట్లు పోలీసు విచారణలో బయటపడింది. భార్య లక్ష్మీ, సహజీవనం చేస్తున్న మహిళ సైదాతో కలసి వేర్వేరు చోట్ల ఇళ్లను అద్దెకు తీసుకుని వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. గతంలో జంపాల అపార్ట్‌మెంట్, సిరినోబుల్‌ అపార్ట్‌మెంట్లలో ఇళ్లు అద్దెకు తీసుకుని కొంతకాలం వ్యభిచార గృహాలు నిర్వహించేవారని, షీ–టీమ్స్‌కు సమాచారం అందడంతో ఇళ్లు ఖాళీ చేసి పరారైనట్లు సమాచారం. ఈక్రమంలో గతేడాది గోపాల్‌ కుటుంబ సభ్యులపై రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనట్లు తెలిసింది. ఇదిలా ఉండగా శరీన్‌నగర్‌కు చెందిన శేఖర్‌ కమీషన్‌పై వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను గోపాల్‌కు సరఫరా చేస్తుంటాడని, ఇతడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. దాడుల్లో షీ–టీమ్స్‌ సభ్యులు దామోదర్, యాగంటి, అన్వర్, వలి, సుజాత, శ్రీలక్ష్మి, రమాబాయి పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement