ప్రేమ పేరుతో మోసం.. మోజు తీరాక మరో పెళ్లి

A Second Married Husband Leaving A Wife In Kandukuru - Sakshi

సాక్షి, కందుకూరు : ఇంజనీరింగ్‌ చదువుతున్న యువకుడు యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు బిడ్డలు పుట్టిన తరువాత వదిలేసి మరో వివాహం చేసుకున్నాడు. బాధిత బాలిక ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డిని కలిసి న్యాయం చేయాలని కోరింది. స్పందించిన ఎమ్మెల్యే బాలికతో డీఎస్పీ రవిచంద్రను కలిశారు. వివరాలలోకి వెళితే.. నెల్లూరు నావాబ్‌పేటకు చెందిన మైనర్‌ ఇంటర్మీడియేట్‌ చదువుతోంది. తన స్నేహితురాలు బంధువుల వివాహానికి వలేటివారిపాలెం మండలం శింగమనేనిపల్లి గ్రామానికి వచ్చింది. ఆదే గ్రామానికి చెందిన వెంకటసురేంద్రతో ఆమెకు పరిచయం ఏర్పాడి ప్రేమగా మారింది. దీంతో మూడేళ్ల క్రితం వెంకట సురేంద్ర చెన్నైలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పి అక్కడకు తీసుకొని వెళ్లి వివాహం చేసుకున్నారు.

అనంతరం కావలి, ఒంగోలు, కందుకూరులో కాపురం పెట్టారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా జన్మించిన బిడ్డ మృతి చెందింది. రెండవ సారి మరో బిడ్డకు జన్మనించింది. ఆ తర్వాత సురేంద్ర పెట్టే చిత్రహింసలు ప్రారంభమైయ్యాయి. వేధింపులు తాళలేక యువతి నెల్లూరులోని అమ్మమ్మ వద్ద ఉంటుంది. తాజాగా సురేంద్ర నాలుగు రోజుల క్రితం మరో వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసి మొదటి భార్య సురేంద్ర ఇంటికి వెళ్లి తనకు తన బిడ్డకు న్యాయం చేయాలని కోరింది. సురేంద్ర, అతడి కుటుంబసభ్యులు బెదిరించడంతో ఆమె సోమవారం మహీధర్‌రెడ్డిని కలిసి న్యాయం చేయాలని కోరింది. స్పందించిన ఎమ్మెల్యే డీఎస్పీ రవిచంద్రను కలిసి సురేంద్రపై చట్టపరమైన చర్యలు తీసుకుని, బాధితురాలకి న్యాయం చేయాలని సూచించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top