నకిలీ చెక్కుతో రూ.45 లక్షల మోసం | RS 45 Lakh Fraud With Fake Cheque In Tamil Nadu | Sakshi
Sakshi News home page

నకిలీ చెక్కుతో రూ.45 లక్షల మోసం

Feb 9 2020 8:46 AM | Updated on Feb 9 2020 8:46 AM

RS 45 Lakh Fraud With Fake Cheque In Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై : నకిలీ చెక్‌తో రూ.45 లక్షల మేరకు మోసగించిన మేనేజర్‌ సహా ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. టి నగర్‌లోని తాంబరం శానటోరియం జీఎస్‌ రోడ్డులోని ప్రముఖ నగల దుకాణంలో పార్థీబన్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం నగల దుకాణం తరఫున తాంబరం పోలీసు స్టేషన్‌లో ఒక ఫిర్యాదు అందింది. అందులో గత ఏడాది డిసెంబర్‌లో నగల దుకాణంలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేసిన పార్థీబన్, వెంకటేశన్, నమ్మాళ్వార్‌ నకిలీ చెక్కు ఉపయోగించి రూ.45 లక్షల మేరకు నగల మోసానికి పాల్పడినట్లు తెలిపారు. దీనిపై శుక్రవారం పోలీసులు విచారణ జరపగా నిజమేనని నిర్ధారణ అయింది. దీంతో వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు అజ్ఞాతంలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

టీచర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని..
టీచర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.6.75 లక్షలు మోసగించిన దిండుగల్‌ జిల్లా ట్రెజరీ కార్యాలయ ఉద్యోగిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లా, జలకంఠాపురానికి చెందిన సిద్ధురాజ్‌ (35). ఇతని భార్య రేవతి (30). అదే ప్రాంతానికి చెందిన కార్తి, జయలక్ష్మి టీచర్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. వీరి బంధువు ఒకరు దిండుగల్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగికి విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలుసని, వారి ద్వారా ప్రభుత్వ ఉద్యోగంలో చేరవచ్చని నమ్మబలికారు. దీన్ని నమ్మిన సిద్ధురాజ్‌ మరో ముగ్గురు దిండుగల్‌ జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సహాయకునిగా పనిచేస్తున్న కరుప్పయ్య (54) నలుగురు కలిసి రూ.6.75 లక్షలను అందజేశారు. అయితే అతను ఉద్యోగాలు ఇప్పించకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో వారు నగదు తిరిగివ్వాలని కోరగా అతను నిరాకరించాడు. దీంతో నలుగురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కరుప్పయ్యను అరెస్టు చేసి కోర్టు ఉత్తర్వుల మేరకు సేలం జైలులో నిర్బంధించారు. 

Advertisement
 
Advertisement
Advertisement