దారుణంగా చంపేశాడు, జైలులో ఆత్మహత్య | Prisoner End lives in YSR kadapa Prison | Sakshi
Sakshi News home page

జైలులో ఆత్మహత్య చేసుకున్న ఓ తండ్రి

Mar 19 2020 11:38 AM | Updated on Mar 19 2020 11:47 AM

Prisoner End lives in YSR kadapa Prison - Sakshi

ఆత్మహత్యకు పాల్పడిన బాలకొండయ్య (ఫైల్‌),రెండవ కుమార్తె శోభన (ఫైల్‌), మృతిచెందిన మొదటి కుమార్తె భావన (ఫైల్‌)

గతంలో భార్య మరణానికి కారణమయ్యాడు. ప్రాణానికి ప్రాణంగా చూసుకుని పెంచిన ఇద్దరు కూతుర్లనూ నెలరోజుల క్రితం దారుణంగా చంపేశాడు. పోలీసులకు పట్టుబడ్డాడు. జైలులో మానసిక సంఘర్షణ చిత్రవధ చేసింది. పిల్లల్ని పొట్టన బెట్టుకున్నానని..  పశ్చాత్తాపం వెంటాడిందో ఏమో..ఆ తండ్రి జైలులోనే బలవన్మరణానికి  పాల్పడ్డాడు.

వైఎస్‌ఆర్‌ జిల్లా, గోపవరం :క్షణికావేశంతో ఓ తండ్రి చేసిన పాపం కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది.  కన్నబిడ్డలనూ చంపేలా చేసింది. చివరికి జైలుపాలై మానసిక క్షోభ తట్టుకోలేక ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చేసిన పాపాలకు తానే మరణ శాసనాన్ని రాసుకున్నాడు.  వివరాలివి.. గోపవరం మండలం శ్రీనివాసాపురానికి చెందిన తాళ్ల బాలకొండయ్యకు  ఇతనికి ఇద్దరు కుమార్తెలు. భార్య చనిపోయినప్పటి నుంచి వ్యవసాయ పనులతో పాటు ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాన్ని బాడుగలకు తిప్పుకుంటూ ఇద్దరు కుమార్తెలను అల్లారుముద్దుగా చూసుకుంటుండేవాడు. స్థానిక పాఠశాలలో చదివించేవాడు.

చిన్నకుమార్తె శోభన రాత్రి సమయంలో తండ్రి వద్దే నిద్రించేది. పొలం వద్ద తండ్రి రాత్రి సమయంలో నిద్రిస్తున్నా అక్కడికి వెళ్లి తండ్రి వద్దే నిద్రపోవాలని మొండికేస్తుండేదని బంధువులు చెబుతున్నారు. ప్రేమాభిమానాలుగా పిల్లలను చూసుకునే బాలకొండయ్య ఒక్కసారిగా మనసు మార్చుకున్నాడు. తన క్షణాకానందానికి పిల్లల్ని అడ్డం కాకుండా తొలగించుకోవాలనుకుని రాక్షసుడిగా మారాడు. గత నెల 27వ తేదీన బాలకొండయ్య తన ఇద్దరు కుమార్తెలు భావన, శోభనలను ఏదో కొనిపెడతానని చెప్పి బైకు ఎక్కించుకున్నాడు. గ్రామానికి సమీపంలో ఉన్న బావిలో తోసేసి కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు. కొద్దిరోజుల తర్వాత పోలీసులు ఇతడ్ని అరెస్టు చేసి బద్వేలులోని సబ్‌జైలుకు తరలించారు.(జూబ్లీహిల్స్‌లో సీఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ అత్మహత్య)

వెంటాడిన పశ్చాత్తాపం
తాను చేసిన పాపానికి బాలకొండయ్యను బలంగా వెంటాడింది. పిల్లలను హతమార్చి జైలుకెళ్లాక నిద్రలేని రాత్రులు గడిపాడని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రేమగా సాకి పిల్లలను బలవంతంగా చంపేశానని బాధ పడి ఉంటాడని భావిస్తున్నాడు. బద్వేలు సబ్‌జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న బాలకొండయ్యను అతని తల్లిదండ్రులు గాని బంధువులు గాని చూడటానికి కూడా వెళ్లలేదని తెలిసింది. తాను ఎవరి కోసం బతకాలని, అటు భార్య బుజ్జమ్మ చావుకు తానే కారణమని, ఇటు ఇద్దరు కుమార్తెలను కిరాతకంగా హత్యచేసిన సంఘటనను గుర్తు చేసుకుంటూ పశ్చాతాపానికి గురై చివరికి మృత్యువును ఆహ్వానించాడు. అరెస్టయిన సబ్‌ జైలులోనే బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు.(ప్రేమను చంపుకోలేక..)

Advertisement
 
Advertisement
Advertisement