సహచరుడి అరెస్ట్‌కు వ్యతిరేకంగా పోలీసుల నిరసన

UP Police Protest Against The Arrest Accused Cop In Murder Of Apple Executive - Sakshi

లక్నో : ఓ కేసులో నిందితుడిగా ఉన్న తమ సహచరుడి అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌ పోలీసులు నిరసన బాట పట్టారు. గత వారం రాత్రి పూట విధుల నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ ప్రశాంత్‌ చౌదరి జరిపిన కాల్పుల్లో ఆపిల్‌ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న వివేక్‌ తివారీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రశాంత్‌ స్పందిస్తూ.. వివేక్‌ తనపై కారుతో దాడికి ప్రయత్నం చేయడంతోనే కాల్పులు జరపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మరోవైపు బాధితుడి బంధువులు మాత్రం ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమానం వస్తే కాల్చేస్తారా అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. 

ఈ ఘటన తరువాత యూపీ పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ప్రశాంత్‌ని అరెస్ట్‌ చేయడంతో పాటు అతన్ని సస్పెండ్‌ చేస్తు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టడానికి సిట్‌ను నియమించింది. కానీ, యూపీకి చెందిన చాలా మంది పోలీసులు ప్రశాంత్‌కు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలను ఖండిస్తున్నారు. అతనికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అతన్ని వెంటనే విడుదల చేసి.. ఉద్యోగంలో చేర్చుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇందుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. అతనిపై చర్యలు ఉపసంహరించకుంటే అమరణ దీక్షకు దిగుతామని కూడా హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా అక్టోబర్‌ 5ను బ్లాక్‌డే పేర్కొంటూ పోలీసు అధికారుల సోషల్‌ మీడియాలో ఓ మెసేజ్‌ వైరల్‌గా మారింది.

చదవండి:
షాకింగ్‌ : కారు ఆపలేదని.. కాల్చేసిన కానిస్టేబుల్‌

ఆపిల్‌ ఉద్యోగి హత్యకు ఎవరు బాధ్యులు?

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top