పారిశ్రామికవేత్త ఇంట్లో ఎన్‌ఆర్‌ఐ హల్‌చల్‌ | NRI Demands Money to Industrialist in Hyderabad | Sakshi
Sakshi News home page

పారిశ్రామికవేత్త ఇంట్లో ఎన్‌ఆర్‌ఐ హల్‌చల్‌

Jun 17 2019 8:34 AM | Updated on Jul 6 2019 12:42 PM

NRI Demands Money to Industrialist in Hyderabad - Sakshi

నిందితులు పొన్‌ విశాఖన్, రాఖేష్‌రాజ్‌

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్‌నెం–12లో ఉంటున్న ఓ పారిశ్రామికవేత్త ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ ఎన్‌ఆర్‌ఐ సదరు ఇంటి యజమానికోసం గాలిస్తూ ఆయన భార్య, అడ్డువచ్చిన సెక్యురిటీ గార్డులను బెదిరించిన సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదివారం ఉదయం బంజారాహిల్స్‌ రోడ్‌నెం–12లోని పారిశ్రామికవేత్త ఇంటికి వచ్చిన ఇద్దరు అపరిచితులు వచ్చి తాము సదరు పారిశ్రామికవేత్తను కలిసి బొకే ఇచ్చి వెళ్లడానికి వచ్చినట్లు సెక్యురిటి గార్డు కృష్ణకు చెప్పారు. అతను ఈ విషయాన్ని యజమానురాలికి చెప్పేందుకు లోపలికి వెళ్లగానే వారు ఇద్దరూ బలవంతంగా లోపలికి ప్రవేశించారు.

దీంతో మీరెవరంటూ సదరు పారిశ్రామికవేత్త భార్య మంజులారెడ్డి ప్రశ్నిస్తుండగానే  వారు ఇంటి ఫోటోలు తీస్తూ తమకు ఇంటి యజమాని రూ.18కోట్లు ఇవ్వాలని ఆయన ఎక్కడ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆయన ఇంట్లో లేరని చెప్పినా వినిపించుకోకుండా న్యూసెన్స్‌ చేశారు. ఆసభ్యంగా దూషిస్తూ తమకు రావాల్సిన రూ.18కోట్లు ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదని బెదిరించారు. దీంతో ఆమె సెక్యురిటీ గార్డులను పిలిచి పోలీసులకు సమాచారం అందించింది.  అక్కడికి వెళ్లిన పోలీసులు సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా ప్రధాన నిందితుడు తన పేరు పొన్‌ విశాఖన్‌ అలియాస్‌ నిక్‌గా తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన తనకు ఆ ఇంటి యజమాని రూ.18కోట్లు ఇవ్వాలని ఈ విషయం అడగేందుకే వచ్చినట్లు చెబుతూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. తమిళనాడుకు చెందిన విశాఖన్‌ ఆస్ట్రేలియాలో స్థిర పడినట్లు విచారణలో వెల్లడైంది. అతడితో పాటు వచ్చిన మరో వ్యక్తిని చెన్నైకి చెందిన రాఖేష్‌ రాజ్‌గా తెలిపారు. నమోదు చేసిన పోలీసులు వారిరువురిని అరెస్ట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement