నిత్యానంద ఆశ్రమం ఖాళీ, బిగుస్తున్న ఉచ్చు | Nithyananda  ashram in Ahmedabad vacated by cops, seize property | Sakshi
Sakshi News home page

నిత్యానంద ఆశ్రమం ఖాళీ, బిగుస్తున్న ఉచ్చు

Dec 2 2019 8:01 PM | Updated on Dec 2 2019 8:42 PM

Nithyananda  ashram in Ahmedabad vacated by cops, seize property - Sakshi

అహ్మదాబాద్‌: వివాదాస్పద మత బోధకుడు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద  చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆశ్రమంలో బాలికలపై అత్యాచారం, కిడ్నాప్‌ ఆరోపణల నేపథ్యంలో నిత్యానంద ఆశ్రమంలో పోలీసులు మరోసారి దాడులు నిర్వించారు. పలు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లోని  నిత్యానంద ఆశ్రమాన్ని జిల్లా అధికారులు  ఖాళీ చేయించారు. తన కుమార్తెలను అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణల  నేపథ్యంలో  ఈ చర్య తీసుకున్నారు.

బాలికల అపహరణ, కిడ్నాప్లాంటి ఇతర క్రిమినల్ అభియోగా నేపథ్యంలో స్థానిక పోలీసులు తాజా దాడులు నిర్వహించారు. ల్యాప్‌టాప్, మొబైల్స్, ట్యాబ్స్‌ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆశ్రమంలోని భక్తులంతా ఆశ్రమాన్ని వీడారు.  అంతేకాదు స్వాధీనం చేసుకున్న డివైస్‌లలో మైనర్ పిల్లలపై శారీరక దాడి, వేధింపులు, తీవ్రంగా హింసిస్తున్న వీడియోలు, ఫోటోలను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిత్యానంద తన కుమార్తెలను అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన జనార్ధన శర్మ గత నెలలో గుజరాత్ రాష్ట్ర పిల్లల రక్షణ పరిరక్షణ కమిషన్‌తో పాటు గుజరాత్ హైకోర్టును ఆశయించారు. పిల్లల్ని తీవ్రంగా హింసించారని ఆరోపించారు. అయితే పోలీసుల చొరవతో ఇద్దరు కుమార్తెలకు విముక్తి లభించగా, పెద్ద కుమార్తెలిద్దరు నిత్యానంద సంస్థను విడిచి పెట్టడానికి నిరాకరించారు. తన పిల్లలను ఆశ్రమంలో బ్రెయిన్ వాష్ చేసి హింసించారని శర్మ ఆరోపించారు. అయితే వీరిని గుర్తించాల్సిందిగా గుజరాత్ హైకోర్టు నవంబర్ 26న పోలీసులను ఆదేశించింది. అంతేకాదు ఇంటర్‌పోల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇతర సంబంధిత అధికారులను కూడా సంప్రదించాలని హైకోర్టు పోలీసులకు సూచించింది. దీంతో కేసు నమోదు చేసిన  గుజరాత్ పోలీసులు పరారీలో ఉన్న నిత్యానందకోసం గాలిస్తున్నారు. 

మరోవైపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఇ) అహ్మదాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు ఇచ్చిన అనుమతిని రద్దు చేసిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. నకిలీ  ఎన్‌ఓసి (నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్)  నిత్యానంద ఆశ్రమాన్ని నడుపుతున్నట్టు నిర్ధారించిన తరువాత అహ్మదాబాద్, హిరాపూర్, దాస్క్రోయిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు మంజూరు చేసిన సీనియర్ సెకండరీ స్థాయి వరకు తాత్కాలిక/సాధారణ ఎఫిలియేషన్‌ను తక్షణమే ఉపసంహరించుకుందని సీబీఎస్‌ఇ నోట్‌ను ఉటంకిస్తూ పీటీఐ పేర్కొంది. అయితే 2020 లో 10, 12 తరగతుల విద్యార్థులను బోర్డు పరీక్షకు హాజరుకావడానికి, తొమ్మిదవ తరగతి ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులను సమీపంలోని సీబీఎస్‌ఐ-అనుబంధ పాఠశాలలకు మార్చడానికి బోర్డు అనుమతించింది.

కాగా అయితే అత్యాచారం కేసులో విచారణను తప్పించుకునేందుకు నిత్యానంద విదేశాలకు పారిపోయినట్టుగా భావిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు నిత్యానంద పాస్‌పోర్ట్  గడువు 2018 సెప్టెంబర్‌లో ముగిసిందనీ,  అత్యాచారం ఆరోపణల కారణంగా రెన్యువల్‌  చేయలేదనీ  ప్రస్తుతం నిత్యానంద ఎక్కడ ఉన్నారో తెలియదని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement