జకీర్ నాయక్‌పై ఎన్‌ఐఏ ఛార్జ్‌ షీట్

NIA Charge Sheet on Zakir Naik

సాక్షి, ముంబై : వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్‌ వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సం‍స్థ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం మొత్తం 58 పేజీలతో కూడిన ఛార్జ్‌-షీట్‌ను దాఖలు చేసింది. జకీర్ నేరారోపణలను ఇందులో ఎన్‌ఐఏ కూలంకశంగా వివరించటం విశేషం.

డాక్టర్‌ జకీర్ తన విద్వేష పూరిత ప్రసంగాలతో జనాలను రెచ్చగొట్టడం.. యువతను ఉగ్రవాదం వైపు మళ్లించటం చేయటంతోపాటు పరారీలో కూడా ఉన్నాడంటూ ఎన్‌ఐఏ ఛార్జ్‌ షీట్ లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ మేరకు ఇండియన్ పీనల్‌ కోడ్‌లోని 295-ఏ, 298, 505-బీ సెక్షన్ల కింద జకీర్ పై కేసులు నమోదయినట్లు వివరించింది. వీటితోపాటు అసాంఘిక చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు జకీర్ కు సంబంధించిన 104 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేయనున్నట్లు ఎన్‌ఐఏ తెలిపింది.

గతేడాది జూలైలో జరిగిన బంగ్లాదేశ్ ఉగ్రవాద దాడి వెనుక జకీర్ ప్రసంగాలే కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తగా... ముంబైకి చెందిన ఈ 51 ఏళ్ల ఈ మత బోధకుడు భారత్ నుంచి మాయం అయ్యాడు. అప్పటి నుంచి పలు దేశాలు మారుతూ.. తప్పించుకు తిరుగుతున్నాడు. ఇంటర్ పోల్‌, ఎన్‌ఐఏ దర్యాప్తులో జకీర్‌ ఫౌండేషన్, పీస్‌ ఛానెల్ ద్వారా ఇలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడన్నది రుజువైంది కూడా.  ప్రస్తుతం అతను సౌదీ అరేబియా పౌరసత్వం కోసం యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top