
కాల్పులకు ముందు పైపుతో సహీద్ వెస్సెల్
న్యూయార్క్ : అమెరికా పోలీసుల అనుమానం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. చేతిలో తుపాకి ఉందనే అనుమానంతో న్యూయార్క్ సిటీ పోలీసులు ఓ వ్యక్తిని దారుణంగా కాల్చి చంపారు. వివరాలలోకి వెళితే.. ఓ నల్ల జాతీయుడు తమ వైపు గన్ గురిపెట్టాడని, ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందనే సమాచారం న్యూయార్క్ పోలీసులకు అందింది.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడి చేతిలో మారుణాయుధం ఉన్నట్లుగా అనుమానించారు. వెంటనే నలుగురు పోలీసులు అతనిపై పదిరౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో అతడు కుప్పకూలిపోయాడు. అయితే వారు అనుమానించిన విధంగా అతని వద్ద ఎలాంటి తుపాకి లభించకపోగా చేతిలో ఉన్నది ఇనుప పైప్ అని తెలియడంతో పోలీసులు ఖంగుతిన్నారు. కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తిని బ్రూక్లీన్కు చెందిన సహీద్ వెస్సెల్గా గుర్తించారు.
అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేక పోయింది. ఆస్పత్రికి తీసుకురావటానికి ముందే అతను మరణించాడని వైద్యులు తెలిపారు. గత వారం కూడా ఇలాంటి ఘటనే నగరంలో చోటు చేసుకుంది. మైకల్ క్లార్క్ అనే వ్యక్తిని కారు అద్దాలు పగులగొడుతున్నాడనే అనుమానంతో పోలీసులు కాల్చి చంపారు. ఈ కాల్పులకు పాల్పడ్డ పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కాలిఫోర్నియా నగరంలో నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి.

సహీద్ గురిపెట్టిన పైప్