నేపాలీ మహిళ అదృశ్యం

Nepali Women Missing in Hyderabad - Sakshi

ఓ యువకుడు ఢిల్లీకి తెచ్చాడు..

ప్రాణహాని ఉందని ఫోన్‌.. కేసు నమోదు

బంజారాహిల్స్‌:  అనుమానాస్పద స్థితిలో ఓ నేపాలీ మహిళ అదృశ్యమైన సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నేపాల్‌కు చెందిన హరీష్, తిళా దంపతులు బతుకుదెరువు నిమిత్తం పదేళ్ల క్రితం నగరానికి వచ్చి బంజారాహిల్స్, సయ్యద్‌నగర్‌లో ఉంటున్నారు. హరీష్‌ వాచ్‌మెన్‌గా పనిచేస్తుండగా తిళా ఇంట్లోనే ఉండేది. ఏప్పుడూ స్మార్ట్‌ ఫోన్‌లో చాటింగ్‌ చేస్తుండటంతో హరీష్‌ భార్యను మందలించాడు. దీంతో తరచూ వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఈ నెల 20న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత హరీష్‌ డ్యూటీకి వెళ్లిపోగా తిళా పిల్లలను వదిలి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన హరీష్‌ భార్య కనిపించకపోవడంతో  నాలుగు రోజులుగా నగరంలో గాలిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం తిళా తన మేనమామ బీమ్‌సింగ్‌కు ఫోన్‌చేసి తాను ఇంటి ఎదురుగా ఉంటున్న యువకుడితో వెళ్లిపోయానని, అతను తనను ఢిల్లీకి తీసుకొచ్చాడని, తనకు ప్రాణహాని ఉందని చెప్పి ఫోన్‌ కట్‌ చేసింది. దీంతో బీమ్‌సింగ్‌ సదరు నెంబర్‌కు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ అని వచ్చింది. దీంతో ఆందోళన చెందిన హరీష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళ కోసం గాలింపు చేపట్టారు. ఫోన్‌ నంబర్‌ ఆధారంగా సెల్‌ సిగ్నల్స్‌ను గుర్తించే పనిలో ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top