ఆత్మహత్య: ఏం కష్టం వచ్చిందో..?  | Mother And Daughter Lifeless In District | Sakshi
Sakshi News home page

ఆత్మహత్య: ఏం కష్టం వచ్చిందో..? 

Mar 28 2020 10:27 AM | Updated on Mar 28 2020 10:27 AM

Mother And Daughter Lifeless In District - Sakshi

సాక్షి, పొట్టిరెడ్డిపాలెం(మర్రిపూడి): ఏం కష్టం వచ్చిందో..ఏమో తల్లీ, కూతుళ్లు ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పొట్టిరెడ్డిపాలెం గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని పొట్టిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన సందల జనార్దన్‌ రెడ్డితో సుమారు పదిహేనేళ్ల క్రింత కోటేశ్వరమ్మతో వివాహమైంది. వీరికి ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. రోజువారీ పనుల్లో భాగంగా భర్త జనార్దన్‌రెడ్డి పశుగ్రాసం కోసం పొలం వెళ్లాడు.

అయితే ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న సంఘటనను మృతురాలు మామ ఒక్కెయ్య చూసి కుమారుడుకు సమాచారం ఇచ్చాడు. కొడుకు పొలం నుంచి తిరిగి ఇంటికి వచ్చే సరికి భార్య కోటేశ్వరమ్మ(32), ఆమె కూతురు నందిని(13) ఇద్దరు ఒకే మంచంపై విగత జీవులుగా పడి ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురు నందినికి కుర్చీ ఎక్కించి చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసి ఉండవచ్చని, అనంతరం ఇంట్లో ఉన్న కందుల బస్తాల పైకి ఎక్కి తల్లి కోటేశ్వరమ్మ కూడా అదే చీరతో మెడకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటుందని సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తుందని ఎస్సై ఏ. సుబ్బరాజు తెలిపారు.

భార్య, భర్తల మధ్య చిన్నపాటి గొడవలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైన కోటేశ్వరమ్మ ఈ సంఘటనకు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కూతురు మర్రిపూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. సంఘటన జరిగిన విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు ఒక్కసారిగా దుఃఖ సాగరంలో మునిగిపోయారు. పొట్టిరెడ్డిపాలెం గ్రామంలో ఆరు నెలల వ్యవధిలో నలుగురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోవడం కలకలం రేపింది. జనార్దన్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement