నదిలో తల్లీపిల్లల గల్లంతు
రెండు మృతదేహాలు లభ్యం
కానరాని మరొకరి ఆచూకీ
రాయగడ: సంక్రాంతి పండగకు బంధువుల ఇంటికి వచ్చిన ఒక కుటుంబం నాగావళినదిపై గల రోప్వేను చూసేందుకు వెళ్లి నదిలో ప్రమాదవశాత్తు మునిగిపోయారు. ఈ ప్రమాదకర సంఘటన కనుమపండగ రోజు జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం రాయగడలోని బంధువుల ఇంటికి వచ్చి మజ్జిగౌరి దర్శనం చేసుకున్న అనంతరం పర్యాటకస్థలమైన రోప్ వే బ్రిడ్జిని చూసేందుకు వెళ్లి నాగావళి నదిలో దిగడంతో ప్రమాదవశాత్తు కాలు జారి మునిగిపోయి గల్లంతయ్యారు.
గల్లంతైన వారిని జె.శాంతి(30) అఖిల్(8), ఇందు(6)లుగా గుర్తిం చారు. ఈ విషాద సంఘటన సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు, చెక్కగుడ ప్రాంతపు ప్రజలు, యువకులు ఘటనాస్థలానికి వెళ్లి ప్రమాదానికి గురైన వారిలో ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. ఇంకొకరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని రాయగడ ఐఐసీ ఆర్.కె.పాత్రో తెలియజేశారు. మృతుల కుటుంబసభ్యుల రోదనతో ఘటనా స్థలం దద్దరిల్లింది. ఇది ప్రమాదకరమైన ప్రాంతం. ఈ ప్రాంతానికి ఎవరూ వెళ్లకూడదు. అని బోర్డులు అక్కడ ఉన్నప్పటికీ ప్రజలు ఇష్టానుసారం నాగావళి నదిలోకి దిగి తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు.