విహారంలో విషాదం

medical Student Sri vidya Died in Road Accident Visakhapatnam - Sakshi

లారీ ఢీకొని వైద్య విద్యార్థిని మృతి

జీర్ణించుకోలేపోతున్న తోటి స్నేహితులు

కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు

అంతవరకూ ఆ విద్యార్థిని స్నేహితులతో ఉత్సాహంగా..గడిపింది. ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో గురువారం నిర్వహించిన ఫెస్ట్‌లో సందడి చేసింది. శుక్రవారం ఉదయం స్నేహితులతో కలిసి లంబసింగి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. విద్యార్థుల సందడిని చూసి ఆ విధికి కన్నుకుట్టిందేమో.. తెల్లవారు జామున లంబసింగి బయలుదేరిన వైద్య విద్యార్థి శ్రీవిద్యను రోడ్డు ప్రమాదం రూపంలో బలిగొంది. ఊహించని ఈ పరిణామానికి స్నేహితులంతా షాక్‌కు గురయ్యారు. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.      

మల్కాపురం (విశాఖపశ్చిమ): మల్కాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మారుతి సర్కిల్‌ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని శ్రీవిద్య మృతి చెందింది. ఆంధ్ర వైద్య కళాశాలలో మూడో ఏడాది చదువుతున్న లావేటి సంతోష్‌(21), శ్రీదివ్య... కేజీహెచ్‌ నుంచి ద్విచక్రవాహనంపై ముందుగా గాజువాక వెళ్లి..అక్కడ నుంచి స్నేహితులంతా కలిసి లంబసింగి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. మారుతి సర్కిల్‌ దగ్గరకు వచ్చే సరికి ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో పడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ శ్రీవిద్య తల పైనుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ద్విచక్ర వాహనం నడుపుతున్న సంతోష్‌ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనతో తోటి మిత్రులు కన్నీరుమున్నీ రయ్యారు. 46వ వార్డు శ్రీహరిపురం, శ్రీనివాస్‌నగర్‌ ప్రాంతానికి చెందిన మొగిలిపురి రవికుమార్‌ చౌదరి పెందుర్తి ఆంధ్రాబ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఇతనికి ఇద్దరు సంతానం. శ్రీవిద్య పెద్ద కుమార్తె. ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ తృతీయ సంవత్సరం చదువుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ పీవీబీ ఉదయ్‌కుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top