కొట్టుకుంటూ కిడ్నాప్ చేశారు
మహిళను ఈడ్చుకెళ్లిన వైనం
సాక్షి, ఎన్ఏడీ జంక్షన్ (విశాఖ పశ్చిమ): మహిళను నడిరోడ్డుపై అరకిలోమీటరు మేర కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లి కిడ్నాప్ చేసిన వ్యవహారం సంచలనం రేపింది. శనివారం యల్లపువానిపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాలు.. యల్లపువానిపాలెంలో గుత్తి లక్ష్మి భర్త నాగరాజు, కుమారుడితో కలిసి ఏడేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నారు. శనివారం సాయంత్రం ఒక కారులో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు యల్లపువానిపాలెం వచ్చారు. గ్రామ శివారులో కారు ఉంచి భర్త లేని సమయంలో లక్ష్మి ఇంటికి వచ్చి జుత్తు పట్టుకొని కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లి కిడ్నాప్ చేశారు. అయితే కుటుంబ కలహాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అందువల్లే ఈ వ్యవహారం జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాగరాజుకు లక్ష్మి రెండో భార్య కాగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఇంటి యజమాని పైడి దాలప్పడు ఫిర్యాదుతోఎస్ఐ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.