అయ్యో.. ఎంత ఘోరం
డివైడర్ దాటుతూ వెనక్కు తూలిపడిన యువకుడు
అదేసమయలో వచ్చిన బస్సు తలపై నుంచి వెళ్లిపోవడంతో దుర్మరణం
విశాఖ క్రైం: విధి చాలా కర్కషంగా కాటేస్తుంది. అనూహ్యంగా మృత్యు ఒడిలోకి లాక్కుపోతుంది. అటువంటి ఘోరమే ద్వారకానగర్ కూడలికి సమీపంలో ఏఎన్నార్ షాపింగ్ మాల్ ఎదుట బుధవారం జరిగింది. డివైడర్ దాటుతుండగా తూలి వెనక్కు పడిన యువకుడిపై నుంచి బస్సు వెళ్లిపోయిన దుర్ఘటనలో ఆ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఆనందపురం మండలం బాకురుపాలెం ప్రాంతానికి చెందిన లండా అరుణకుమార్(18) ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. పోటీ పరీక్షల కోసం స్వస్థలం నుంచి బస్సులో వచ్చి ద్వారకానగర్లోని వికాస్ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్నాడు. రోజూ మాదిరిగా బుధవారం ఉదయం 11 గంటల సమయంలో స్నేహితుడితో కలిసి వెళ్లడానికి ఆర్టీసీ కాం ప్లెక్స్లో దిగాడు. స్నే హితుడు రావడం ఆలస్యం కావడంతో ఒక్కడే నడుచుకుంటూ ద్వారకానగర్ ట్రాఫిక్ సిగ్నల్ కూడలి దగ్గరకు చేరుకున్నాడు.
సరిగ్గా ఏఎన్ఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా డివైడర్ను దాటడానికి ఒక అడుగు వేశారు. రెండో కాలు వేసేలోపు తూలి వెనక్కు పడిపోయాడు. అదే సమయంలో ఆ మార్గంలో కాంప్లెక్స్ నుంచి గాజువాక వెళ్తున్న ఆర్టీసీ బస్సు (38 వై) ఏపీ31 టిఎఫ్ 3336) రావడంతో దాని కింద పడిపోయాడు. దీంతో తల వెనుక భాగం నుజ్జయి తీవ్ర రక్తస్రావమైంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ద్వారకా పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రాజు వెంటనే సమీపంలోని కళా ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్థారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు తరలించారు. ఎస్ ఐ కాంతారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడి మరణవార్త తెలు సుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.