సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. శ్యామ్పూర్ గ్రామ శివారులోని బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బ్రిడ్జి కింద పడిపోయింది. బస్సు ఆదిలాబాద్ వైపు నుంచి ఉట్నూర్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక, ఈ ప్రమాదం కారణంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ సహా ప్రయాణీకులకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో బస్సుల్లో 25 మంది ప్రయాణీకులు ఉన్నారు. గాయపడిన వారికి ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు.. ఆసిఫాబాద్ డిపోకు చెందిన బస్సు ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మంత్రి పొన్నం ఫోన్లో మాట్లాడారు. శ్యామ్పూర్ బ్రిడ్జిపై ప్రొటెక్షన్ వాల్ లేకపోవడమే కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని మంత్రికి ఎండీ చెప్పుకొచ్చారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో కూడా మంత్రి పొన్నం మాట్లాడారు. గాయపడిన వారికి నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశాలు ఇచ్చారు.



