ఇనుమును బంగారంగా నమ్మించి | Man Cheated With Iron Rods in Hyderabad | Sakshi
Sakshi News home page

ఇనుమును బంగారంగా నమ్మించి

Oct 1 2019 11:16 AM | Updated on Oct 1 2019 11:16 AM

Man Cheated With Iron Rods in Hyderabad - Sakshi

నిందితుడు మహ్మద్‌ ఇనాం

బంజారాహిల్స్‌: ఇనుప కడ్డీలను బంగారు కడ్డీలుగా నమ్మించి ఓ మేస్త్రిని నిండా ముంచిన ఘటనలో నిందితుడ్ని బంజారాహిల్స్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ పీడీ నాయుడు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హర్యానాకు చెందిన మహ్మద్‌ ఇనాం అలియాస్‌ అబ్బాస్‌ ప్రొక్లెయినర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తూ ఫిలింనగర్‌లోని బాలాజీ  స్టోన్‌ క్రషింగ్‌ యజమాని వద్ద ఉంటున్నాడు. ఫిలింనగర్‌ వినాయకనగర్‌ బస్తీకి చెందిన వెంకటయ్య స్టోన్‌ కట్టింగ్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. గత మే నెల 29న వెంకటయ్య బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–3లోని టీవీ9 బస్టాప్‌ వద్ద రాళ్లు కొట్టే పని ఉండటంతో ఇనాం తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. రెండు రోజు ల పాటు ఇనాంతో కలిసి తిరగడంతో అతడితో స్నేహం పెరిగింది. ఈ నేపథ్యంలో ఇనాం తన గ్రామం నుంచి తన స్నేహితుడు మహ్మద్‌ హసన్‌ ఫోన్‌ చేశాడని, బంగారాన్ని రూ.20వేలకు తులం విక్రయిస్తున్నట్లు చెప్పా డు. 

దీంతో ఆశ పడిన వెంకటయ్య ఆ బంగారం తానే కొంటానని ఒప్పందం కుదుర్చుకొని ముందుగా రూ.5లక్షలు, ఆ తర్వాత రూ.2.50 లక్షలు చెల్లించాడు. అనంతరం ఇద్దరూ కలిసి హర్యానాలోని ఇనాం గ్రామానికి వెళ్లగా వెంకటయ్య  రెండు కడ్డీలను తీసుకున్నాడు. వాటిని తనిఖీ చేయించిన అనంతరం మిగతా డబ్బులు చెల్లిస్తానని చెప్పి వచ్చాడు. హైదరాబాద్‌కు వచ్చిన వెంకటయ్య వాటిని బంగారం షాపులో చూపించగా అవి ఇనుప కడ్డీలని చెప్పారు.  ఈ విషయం పోలీసులకు చెబితే నిందితుడు పారిపోయే ప్రమాదం ఉందని భావించిన వెంకటయ్య గత జూన్‌ 25న ఓ వ్యక్తి తనను కిడ్నాప్‌ చేసి మత్తు చల్లి సికింద్రాబాద్‌ ప్రాంతానికి తీసుకెళ్లి రూ.7.50 లక్షలు లాక్కున్నాడని పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసిన పోలీసులు ఇనాంను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు.  నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు హసన్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement