ప్రేమకథ విషాదాంతం | Love Couple Commits Suicide in Anantapur | Sakshi
Sakshi News home page

ప్రేమకథ విషాదాంతం

Apr 22 2019 11:38 AM | Updated on Apr 22 2019 11:38 AM

Love Couple Commits Suicide in Anantapur - Sakshi

మల్లికార్జున, మాధవి

ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు... ఏడాది కాలంగా ప్రేమించు కుంటున్నారు. ఈ సమాజంలో కులం అనే అడ్డుగోడలు తమ ప్రేమను ఆమోదించవని భయపడ్డారు. తమ ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలిస్తే ఏ అనర్థం జరుగుతుందోనన్న ఆందోళనఆ ప్రేమికులకు వెంటాడింది. తమ వెంట తెచ్చుకున్న విషపుగుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే మృత్యువు సమీపించడంతో వారిలో బతకాలనే ఆశ కలిగింది. తాము ఎందుకు మరణించాలి? తాము బతికి తమ ప్రేమను బతికించుకోవాలని నిర్ణయించుకుని స్వయంగా ఆస్పత్రికి వెళ్లి తమను కాపాడాలని వేడుకున్నారు. అప్పటికే వారి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆ ప్రేమికులు మృత్యువాతపడ్డారు.  

అనంతపురం, పుట్లూరు: పుట్లూరు మండలం బాలాపురం ఎస్సీ కాలనీకి చెందిన మల్లికార్జున (20) తాడిపత్రిలో ఐటీఐ పూర్తి చేశాడు. విడపనకల్లు మండలం కొట్టాలపల్లికి చెందిన సి.మాధవి(19) తన తల్లి స్వస్థలం పుట్లూరు మండలం కోమటికుంట్లలో తాత రాముడు ఇంటి వద్ద ఉంటూ తాడిపత్రిలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ చదివింది. వీరిద్దరూ ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం కుటుంభ సభ్యులకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. డిగ్రీ పూర్తీ చేసిన మాధవి తన స్వగ్రామానికి వెళ్లింది. శనివారం మధ్యాహ్న సమయంలో ప్రేమికులిద్దరూ ముందస్తు ప్రణాళిక ప్రకారం తాడిపత్రికి చేరుకున్నారు. కులాలు వేరు అయినందున తమ ప్రేమను పెద్దలు అంగీకరించరని చర్చించుకున్నారు. కలిసి జీవించే పరిస్థితి లేనపుడు కలిసి చనిపోదామనే నిర్ణయానికి వచ్చారు. వెంట తెచ్చుకున్న విషపుగుళికలు ఇద్దరూ మింగి ఆత్మహత్యాయత్నం చేశారు.

మనసు మార్చుకుని.. బతకాలని..!
ఆత్మహత్యాయత్నం చేసిన ఈ ప్రేమికులు తాము బతికి ప్రేమనూ బతికించుకోవాలని మనసు మార్చుకున్నారు. స్వయంగా తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి చేరి తాము ఆత్మహత్యాయత్నం చేశామని, తమను బతికించాలని అక్కడి వైద్య సిబ్బందిని వేడుకున్నారు. వారిని పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో సైతం మల్లికార్జున తాను ఉన్న బెడ్‌ నుంచి లేచి మాధవి ఎలా ఉంది.. అని ఆమె వద్దకు వెళ్లడానికి ప్రయత్నించాడు. చికిత్స పొంతుతూ మల్లికార్జున, మాధవిలు శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement