ఎందుకు వచ్చావంటూ.. భార్యపై భర్త దాడి | Husband Attacks His Wife Warangal | Sakshi
Sakshi News home page

ఎందుకు వచ్చావంటూ..భార్యపై భర్త దాడి

Nov 20 2018 12:09 PM | Updated on Nov 20 2018 12:09 PM

Husband Attacks His Wife Warangal - Sakshi

నెక్కొండలో చికిత్స పొందుతున్న సంగీత

సాక్షి, నెక్కొండ: భార్యపై భర్త దాడి చేయడంతో మనస్తాపానికి గురై భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని గుండ్రపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై నవీన్‌కుమార్, గ్రామస్తుల కథనం ప్రకారం... వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి మండలం ముచ్చర్లనాగారంకు చెందిన సంగీత, గుండ్రపల్లి గ్రామానికి చెందిన భూపతి ప్రకాశ్‌లు ఏడాది క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. కొంత కాలం కలిసి ఉండగా వీరి మధ్య మనస్పర్థలు రావడంతో సంగీతకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తన భర్త కోసం గుండ్రపల్లిలో ఉన్న అత్తారింటికి వచ్చి ఆమె గతంలో గొడవకు దిగింది. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా ఇద్దరు కలిసి ఉండాలని చెప్పారు.

కొన్ని నెలలు కలిసి ఉన్నప్పటికీ వీరి మధ్య మళ్లీ గొడవలు జరగడంతో ప్రకాశ్‌ విడాకుల కోసం నోటీసు పంపించాడు. దాంతో  నాలుగు రోజుల క్రితం గుండ్రపల్లి వచ్చి భర్త జాడ తెలపాలని ప్రకాశ్‌ తల్లిదండ్రులను కోరింది. ప్రకాశ్‌ ఇక్కడికి రాలేదని, ఆమెను వారు ఇంట్లోకి రానివ్వలేదు. సోమవారం భర్త వచ్చిన విషయం తెలుసుకొని సంగీత ప్రకాశ్‌ ఇంటికి వచ్చింది.  కేసు కోర్టులో ఉండగా ఎందుకు వచ్చావంటూ భర్త ప్రకాశ్‌ కోపోద్రికుడై ఆమెపై దాడికి దిగాడు. దాంతో మనస్తాపానికి గురైన సంగీత పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై   తన వాహనంలో చికిత్స నిమిత్తం నెక్కొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం నర్సంపేటకు 108 వాహనంలో తరలించారు.
తండ్రి లేడు..తల్లి కాదందీ..భర్తతో ఉంటా:బాధితురాలు సంగీత ప్రేమించి పెండ్లి చేసుకున్నా.. తండ్రి లేడు, ఉన్నా తల్లి కాందటోంది... భర్త తోడు కరువవడంతో మనస్తాపానికి గురయ్యాను. భర్త కాదంటే ఆత్మహత్యే శరణ్యం. అధికారులు తనకు న్యాయం జరిగేలా చూడాలి. నెక్కొండలో చికిత్స పొందుతున్న సంగీత 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement