చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికాడు..?!

Handloom Worker Dies Of Electric Shock In Karimnagar - Sakshi

 చెమటలు వస్తున్నాయని అనుమానాలు.. 

మృతిచెందాడని చెప్పిన స్థానిక వైద్యులు 

వినకుండా కరీంనగర్‌   ఆస్పత్రికి తరలింపు 

చనిపోయాడని అక్కడి వైద్యులు ధ్రువీకరించడంతో వెనక్కి.. 

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ 

తంగళ్లపల్లి(సిరిసిల్ల) : విద్యుత్‌షాక్‌కు గురైన వ్యక్తిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.అప్పటికే చనిపోయాడని వైద్యులు మార్చురీకి తరలించారు. బంధువుల్లో ఒకరు చూసేందుకు వెళ్లి మృతదేహానికి చెమటలు వస్తున్నాయని కుటుంబసభ్యులుకు తెలిపాడు. వెంటనే కరీంనగర్‌ తరలించగా.. ఎప్పుడో చనిపోయాడని ధ్రువీకరించడంతో నిరాశతో వెనుదిరిగారు. వివరాల్లోకెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మనగర్‌కు చెందిన సిరిసిల్ల చంద్రమౌళి (42) నేతకార్మికుడు.బుధవారం ఉదయం 5.30 గంటలకు కార్ఖానాకు వెళ్లిన చంద్రమౌళి సాంచాల మరమతుకు పూనుకున్నాడు. ఈక్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు.

కుటుంబసభ్యులు జిల్లాకేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చంద్రమౌళి చనిపోయినట్లు నిర్ధారించి మృతదేహన్ని మార్చరీకి తరలించారు. ఉదయం 9.30గంటలకు బంధువు ఒకరు వచ్చి మార్చరీలోని చంద్రమౌళి మృతదేహాన్ని చూశాడు. శరీరంలో నుంచి చమటలు వస్తున్నాయని, అతడు బతికే ఉన్నాడని సందేహం వెలిబుచ్చాడు.మృతి చెందాడని వైద్యులు చెబుతున్నా వినకుండా వెంటనే కరీంనగర్‌ తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు చంద్రమౌళి శరీరాన్ని పరీక్షించి చాలాసేపటి క్రితమే చనిపోయాడని నిర్ధారించారు. దీంతో కుటుంబసభ్యులు ఆ శవంతో వెనుదిరిగారు. అయితే, చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికాడంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top