చిన్నారిని బలిగొన్న స్కూల్‌ బస్సు | Four Years Girl Died In Road Accident | Sakshi
Sakshi News home page

చిన్నారిని బలిగొన్న స్కూల్‌ బస్సు

Jul 28 2018 9:24 AM | Updated on Sep 15 2018 4:05 PM

Four Years Girl Died In Road Accident - Sakshi

వైష్ణవి మృతదేహం వద్ద రోదిస్తున్నతల్లి, బంధువులు 

మాడ్గుల రంగారెడ్డి : మాడ్గుల మండలం ఆర్కపల్లి పంచాయతీ పరిధిలోని పల్గుతండాకు చెందిన నాలుగేళ్ల చిన్నారి శుక్రవారం సాయంత్రం స్కూల్‌ బస్సు కిందపడి మృత్యువాతపడింది. తండావాసులు, పోలీసుల కథనం ప్రకారం.. పల్గుతండాకు చెందిన రామావత్‌ ప్రసాద్, పార్వతీలకు ఇద్దరు కూమార్తెలు. పెద్ద కూతురు వైష్ణవి(4) మాడ్గుల సెయింట్‌మేరీ స్కూల్‌లో నర్సరీ చదువుతోంది.

పల్గుతండా నుంచి ప్రతిరోజు స్కూల్‌ బస్సులో తండాకు చెందిన విద్యార్థులతో కలిసి పాఠశాలకు వెళ్లివస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి స్కూల్‌ బస్సులో తండాకు వచ్చిన వైష్ణవి తండాలో బస్సు దిగింది. ఆ సమయంలో వైష్ణవి చేతిలో ఉన్న టిఫిన్‌బాక్స్‌ ఉన్న బుట్ట ప్రమాదశాత్తు కిందపడిపోయింది. కిందపడిన బుట్టను తీసుకునేందుకు వంగింది. గమనించని బస్సు డ్రైవర్‌ బస్సును ముందుకు కదిలించాడు.

బస్సు వెనుక చక్రం ఆ చిన్నారి తలపై నుంచి పోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విద్యార్థులు అరవడంతో బస్సును నిలిపివేసిన డ్రైవర్‌ మృతదేహాన్ని చూసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న వైష్ణవి తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని చూసి చలించిపోయారు.

ఈ ఏడాదే స్కూల్‌కు పంపించాం బిడ్డా.. అప్పుడే శవమైతివా.. అని రోదించిన తీరు తండావాసులను కన్నీరు పెట్టించింది. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సైదులు పంచనామా నిర్వహించి.. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement