
హైదరాబాద్ : అంబర్ పేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అంబర్పేటలోని జిందా తిలిస్మత్ రోడ్డులో ఉన్న ఓ పేపర్ మిల్లులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమైనట్లు సమాచారం. ఆ వివరాలిలా.. స్థానిక అంబర్పేటలోని పేపర్ మిల్లులో తొలుత అకస్మాత్తుగా మొదలైన మంటలు కొంతసమయానికే పూర్తి మిల్లుకు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగసి పడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. పేపర్ మిల్లు మంటల్లో పూర్తిగా కాలి దగ్దమైనట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.