అవతార పురుషుడని... అకృత్యాలు | fake swamiji fraud to people in karnataka | Sakshi
Sakshi News home page

అవతార పురుషుడని... అకృత్యాలు

Jan 18 2018 12:13 PM | Updated on Aug 21 2018 6:02 PM

fake swamiji fraud to people in karnataka - Sakshi

సాక్షి, బళ్లారి: కర్ణాటక చిత్రదుర్గలో తనకు కంచీవరదస్వామి ఆవహిస్తున్నాడని, గత కొంతకాలంగా అక్కడ ప్రజలను నమ్మబలికాడు ఓ వ్యక్తి. అంతేకాక ఆ ప్రాంత ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత తనకు తాను..అవతార పురుషుడుగా ప్రకటించుకుని కార్యకలాపాలు సాగిస్తున్న లోకేష్‌ అనే బురిడీబాబా అసలు స్వరూపం బుధవారం బయట పడింది. వివరాలు.. చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకా కంచీపురం గ్రామానికి చెందిన లోకేష్‌ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా అదే గ్రామంలో ఎంతో మహిమాన్వితుడుగా, దేవమానవుడుగా పేరుగాంచిన కంచీవరద స్వామి తనకు పూనుతున్నాడని ప్రజలను నమ్మించాడు. అవీ ఇవీ జిమ్మిక్కులు చేస్తూ జిల్లాతో పాటు బెంగళూరులోనూ నమ్మకం సంపాదించాడు.

ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై కన్ను 
అదే గ్రామానికి చెందిన ఓ ఉపాధ్యాయుని కుమార్తె ఇంజినీరింగ్‌ చదువుతోంది. ఆమెను తనకు ఇచ్చి పెళ్లి చేయాలని స్వామి ఆదేశించారని నేరుగా అమ్మాయి తల్లిదండ్రుల వద్ద లోకేష్‌ ప్రతిపాదన తెచ్చాడు. దీంతో టీచర్‌ బంధువులు లోకేష్‌ అసలు విషయం తెలుసుకుని ప్రజలకు తెలియజేశారు. ఈ విషయంపై స్థానిక పోలీసు స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం ఒక్కసారిగా చిత్రదుర్గ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బురిడీ బాబా తెర వెనుక చేస్తున్న కార్యకలాపాలు ఎన్నో ఉన్నాయని పలువురు పోలీసు స్టేషన్‌కు వచ్చి ఆందోళన చేశారు. తమను కూడా వేధించారని, ఆయనకు ఏ స్వామీ ఆవహించడం లేదని దొంగ స్వామి అంటూ మండిపడ్డారు. 

రెండు వర్గాలుగా జనం 
అయితే అదే గ్రామానికి చెందిన మరో సగం మంది లోకేష్‌కు మద్దతుగా నిలుస్తూ స్వామీజీ ఎన్నో మహిమలు చూపారని, అంతేకాక చాలా మందికి మంచి జరిగిందని, అవతార పురుషుడు, దైవాంశ సంభూతుడని మద్దతుగా నిలిచారు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న పోలీసులు లోకేష్‌తో లిఖిత పూర్వకంగా రాయించుకుని జామీను మీద వదిలిపెట్టారు.  

Advertisement
 
Advertisement
Advertisement