వివాహేతర సంబంధం: ‘దృశ్యం’ సినిమాను తలపించేలా..
ముంబై: హత్య చేయడమే కాకుండా.. శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఆధారాలు మాయం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ నేరంలో అతడికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ నీలేశ్ భర్నే ఆదివారం మీడియాకు వెల్లడించారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ‘దృశ్యం’ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని హత్యకు సంబంధించిన ఆధారాలను మాయం చేసేందుకు నిందితులు ప్రయత్నించారని పేర్కొన్నారు.
వివరాలు.. పంకజ్ దిలీప్ గీరాంకర్(32) అనే వ్యక్తి నాగ్పూర్లోని ఓ హల్దీరాం కంపెనీలో ఎలక్ట్రీషియన్గా పనిచేసేవాడు. అతడు పనిచేసే చోటుకు సమీపంలో ఉన్న ఓ దాబా యజమాని అమర్సింగ్ అలియాస్ లల్లూ జోగేందర్ సింగ్ ఠాకూర్(24).. గీరాంకర్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గీరాంకర్.. పద్ధతి మార్చుకోవాలని జోగేందర్ను పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాకపోయేసరికి.. కుటుంబంతో సహా వార్ధాకు మకాం మార్చాడు. అయినా కూడా మరోసారి గీరాంకర్ భార్యను కలిసేందుకు జోగేందర్ ప్రయత్నించాడు.(చదవండి: వాళ్లు బానిసలు.. వారిద్దరి తలలు నరుకు అంటూ..)
ఈ నేపథ్యంలో కోపోద్రిక్తుడైన గీరాంకర్ తన మోటార్సైకిల్పై.. జోగేందర్ను హెచ్చరించేందుకు గతేడాది డిసెంబరు 28న.. అతడి దాబాకు వెళ్లాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగగా.. జోగేందర్ తన చేతిలో ఉన్న సుత్తితో గీరాంకర్ తలపై పలుమార్లు కొట్టాడు. ఈ ఘటనలో గీరాంకర్ అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో భయానికి గురైన జోగేందర్ తన దాబాలో పనిచేసే వ్యక్తి, మరో ఇద్దరి సహాయంతో గీరాంకర్ శవాన్ని మాయం చేసేందుకు పథకం రచించాడు.(చదవండి: ఘోరం: అక్కాచెల్లెళ్లను తాళ్లతో కట్టి ఈడ్చుకెళ్లారు)
ఇందులో భాగంగా... తొలుత మృతదేహాన్ని తగులబెట్టి తన దాబా వెనుక ప్రాంతంలో 10 అడుగుల గొయ్యి తవ్వించాడు. అందులో 50 కిలోల ఉప్ప పోసి గీరాంకర్ శవాన్ని పూడ్చాడు. అనంతరం అతడి మోటార్ సైకిల్ను తగులబెట్టాడు. ఆ తర్వాత గీరాంకర్ ఫోన్ను రాజస్తాన్కు వెళ్లే ఓ ట్రక్కులో పారేశాడు. ఈ క్రమంలో గీరాంకర్ ఇంటికి రాకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆధారాలతో సహా జోగేందర్ను అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకుని విచారణ జరుపగా తానే గీరాంకర్ను హత్య చేసినట్లు అతడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం దాఖలైన మిస్సింగ్ కేసు మిస్టరీ ఛేదించినట్లు పేర్కొన్నారు.