వివాహేతర సంబంధం: ‘దృశ్యం’ సినిమాను తలపించేలా..

Drishyam Movie Style Murder In Maharashtra 3 Men Arrested - Sakshi

ముంబై: హత్య చేయడమే కాకుండా.. శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఆధారాలు మాయం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ నేరంలో అతడికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ నీలేశ్‌ భర్నే ఆదివారం మీడియాకు వెల్లడించారు. బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ ​‘దృశ్యం’ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని హత్యకు సంబంధించిన ఆధారాలను మాయం చేసేందుకు నిందితులు ప్రయత్నించారని పేర్కొన్నారు.

వివరాలు.. పంకజ్‌ దిలీప్‌ గీరాంకర్‌(32) అనే వ్యక్తి నాగ్‌పూర్‌లోని ఓ హల్దీరాం కంపెనీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడు. అతడు పనిచేసే చోటుకు సమీపంలో ఉన్న ఓ దాబా యజమాని అమర్‌సింగ్‌ అలియాస్‌ లల్లూ జోగేందర్‌ సింగ్‌ ఠాకూర్‌(24).. గీరాంకర్‌ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గీరాంకర్‌.. పద్ధతి మార్చుకోవాలని జోగేందర్‌ను పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాకపోయేసరికి.. కుటుంబంతో సహా వార్ధాకు మకాం మార్చాడు. అయినా కూడా మరోసారి గీరాంకర్‌ భార్యను కలిసేందుకు జోగేందర్‌ ప్రయత్నించాడు.(చదవండి: వాళ్లు బానిసలు.. వారిద్దరి తలలు నరుకు అంటూ..)

ఈ నేపథ్యంలో కోపోద్రిక్తుడైన గీరాంకర్‌ తన మోటార్‌సైకిల్‌పై.. జోగేందర్‌ను హెచ్చరించేందుకు గతేడాది డిసెంబరు 28న.. అతడి దాబాకు వెళ్లాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగగా.. జోగేందర్‌ తన చేతిలో ఉన్న సుత్తితో గీరాంకర్‌ తలపై పలుమార్లు కొట్టాడు. ఈ ఘటనలో గీరాంకర్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో భయానికి గురైన జోగేందర్‌ తన దాబాలో పనిచేసే వ్యక్తి, మరో ఇద్దరి సహాయంతో గీరాంకర్‌ శవాన్ని మాయం చేసేందుకు పథకం రచించాడు.(చదవండిఘోరం: అక్కాచెల్లెళ్లను తాళ్లతో కట్టి ఈడ్చుకెళ్లారు)

ఇందులో భాగంగా... తొలుత మృతదేహాన్ని తగులబెట్టి తన దాబా వెనుక ప్రాంతంలో 10 అడుగుల గొయ్యి తవ్వించాడు. అందులో 50 కిలోల ఉప్ప పోసి గీరాంకర్‌ శవాన్ని పూడ్చాడు. అనంతరం అతడి మోటార్‌ సైకిల్‌ను తగులబెట్టాడు. ఆ తర్వాత గీరాంకర్‌ ఫోన్‌ను రాజస్తాన్‌కు వెళ్లే ఓ ట్రక్కులో పారేశాడు. ఈ క్రమంలో గీరాంకర్‌ ఇంటికి రాకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆధారాలతో సహా జోగేందర్‌ను అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకుని విచారణ జరుపగా తానే గీరాంకర్‌ను హత్య చేసినట్లు అతడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం దాఖలైన మిస్సింగ్‌ కేసు మిస్టరీ ఛేదించినట్లు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top