ఎస్‌ఐని దారుణంగా కొట్టి చంపారు.. | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐని దారుణంగా కొట్టి చంపిన గ్యాంగ్‌స్టర్స్‌

Published Mon, May 20 2019 1:46 PM

Delhi Police SI beaten to death by gangsters in Vivek Vihar  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ఢిల్లీలో  గ్యాంగ్‌స్టర్స్‌ బీభత్సం సృష్టించారు.  అక్రమ మద్యం, డ్రగ్స్‌ విక్రయాలను అడ్డుకుంటున్నాడనే అక్కసుతో ఢిల్లీ పోలీస్ కమ్యూనికేషన్స్ విభాగంలో ఎస్ఐగా పనిచేస్తున్న రాజ్‌ కుమార్ (56 ఏళ్ళు)ను వెంటాడి మరీ దారుణగా  కొట్టి చంపారు. షాదరా జిల్లాలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. 

పోలీసు ఉన్నతాధికారి మేఘనా యాదవ్ అందించిన సమాచారం ప్రకారం, నిందితుడు విజయ్ అలియాస్ భరూరి కస్తూర్బా నగర్‌కు చెందినవాడు. ఆదివారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి  వెళ్లిన ఎస్‌ఐ  రాజ్‌కుమార్‌ భోజనానంతరం రోజూలాగానే వాకింగ్‌ చేస్తున్నారు. ఇంతలో  కొంతమంది  ఎస్‌ఐతో వాదనకు దిగి దుర్భాషలాడారు. దీన్ని వ్యతిరేకించిన ఎస్‌పై గ్యాంగస్టర్స్‌ విరుచుకుపడి తీవ్రంగా కొట్టడం ప్రారంభించారు. దీంతో  తనను తాను రక్షించుకునేందుకు ఎస్‌ఐ  స్థానిక పోలీసు ఠాణాలోకి పారిపోయారు.  అయినా రెచ్చిపోయిన నిందితులు ఎస్‌ఐను దారుణంగా కొట్టి  అక్కడినుంచి పారి పోయారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. స్థానిక కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి, హత్య కేసు నమోదు చేశామని మేఘనా యాదవ్‌ తెలిపారు. నిందితులపై  రెండు డజన్లకు పైగా కేసులు ఉన్నట్టు తెలుస్తోంది.

ఎనిమిది నుంచి తొమ్మిదిమంది తన తండ్రిపైదాడి చేసి కొట్టి చంపేశారని రాజ్‌కుమార్‌ కుమార్తె వైశాలి కన్నీరు మున్నీరయ్యారు. మద్యం, డ్రగ్స్‌ అమ్మకాలను వ్యతిరేకించినందుకు తన తండ్రిని చంపేస్తామని ఇప్పటికే చాలా సార్లు బెదరించారనీ ఆమె ఆరోపించారు.  తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement