
ఏఎస్ఐ సుధీర్ త్యాగిని కాల్చిచంపిన దుండగులు
సాక్షి, లక్నో : ఢిల్లీకి చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) సుధీర్ కుమార్ త్యాగిని యూపీలో కొందరు దుండగులు కాల్చిచంపారు. భజన్పుర పోలీస్ స్టేషన్లో నియమితులైన త్యాగి గురువారం విధులు ముగించుకుని బైక్పై భార్య, కుమర్తెతో కలిసి ఇంటికి తిరిగివస్తుండగా బైక్పై వచ్చిన ముగ్గురు ఆగంతకులు ఆయనపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. దాడి జరిగిన సమయంలో ఏఎస్ఐ హపూర్ జిల్లాలోని తన స్వగ్రామం నగోలాకు వెళుతున్నారు. దుండగులు జరిపిన కాల్పుల్లో త్యాగి ఘటనాస్థలంలోనే మరణించారు.
పట్టపగలు పోలీస్ అధికారిని కాల్చిచంపిన ఘటనతో స్ధానికులు విస్తుపోయారు. త్యాగిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. మోదీనగర్ రోడ్డు కొత్వాలి నగర సమీపంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏఎస్ఐ హత్యతో జిల్లా ఎస్పీ సహా హపూర్ జిల్లా అధికారులు ఘటనాస్ధలానికి చేరుకున్నారు. నిందితుల కోసం స్ధానిక పోలీసులు గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులకు స్ధానిక పోలీసులు సమాచారం అందించారు.