యువకుడిపై చిరుత దాడి
సాక్షి, నిర్మల్ : చిరుత దాడిలో యువకుడు గాయపడిన సంఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలం అక్టోనిమాడ గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆత్రం సంతోష్(19) ఉదయం పంటచేనుకు వెళ్తుండగా చిరుతపులి ఒక్కసారిగా దాడిచేసింది. యువకుడు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న గ్రామస్థులు అక్కడకు చేరుకోవడంతో చిరుత పారిపోయింది. దాడిలో యువకుడి కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. గాయపడిన సంతోష్ను చికిత్స నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చిరుత సంచారంపై గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.