కారు.. ఠారు! | Car Accidents in Hyderabad | Sakshi
Sakshi News home page

కారు.. ఠారు!

Jun 10 2019 8:37 AM | Updated on Jun 10 2019 8:37 AM

Car Accidents in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో:శుక్రవారం తెల్లవారుజాము:–బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లో మితిమీరిన వేగంతో వస్తూ అదుపుతప్పిన కారు రోడ్డు పక్కన ఓ గదిలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి.  
శనివారం ఉదయం:–ఛత్రినాక వైపు నుంచి చాంద్రాయణగుట్ట వైపు వస్తున్న స్కార్పియో ఛత్రినాక చౌరస్తా వద్ద సైక్లిస్ట్‌ను తప్పించబోయి ఓ దుకాణంలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.  

రాజధానిలో జరుగుతున్న కారు/తేలికపాటి వాహనాల ప్రమాదాలకు మచ్చుతునకలివి. తరచు ఏదో ఒక ప్రాంతంలో ఈ వాహనాలు ఠారెత్తించేస్తున్నాయి. అత్యధిక ప్రమాదాలకు మితిమీరిన వేగమే కారణంగా మారుతోంది. ఇలా వరుస ఘటనలకు అనేక కారణాలు ఉంటున్నా యని పోలీసులు చెబుతున్నారు. ఏటా నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో తేలికపాటి వాహనాలుగా పిలిచే కార్ల వాటా పది శాతానికి పైగా ఉంటోంది. గత ఏడాది జరిగిన ప్రమాదాల్లో 38 శాతం తేలికపాటి వాహనాల కారణంగా జరిగినవేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

మద్యం నుంచి నిర్లక్ష్యం వరకు...
తేలికపాటి వాహనాలకు సంబంధించిన ప్రమాదాల్లో అత్యంత సంచలనాత్మక ఘటనలూ ఉంటున్నాయి. బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలోని పంజగుట్ట శ్మశానవాటిక వద్ద జరిగిన చిన్నారి రమ్య ఉదంతం, నారాయణగూడ ఫ్లైఓవర్‌ పై పట్టపగలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న వైనం..ఇందుకు నిదర్శనం. ప్రధానంగా మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేయడంతో పాటు నిర్లక్ష్యంగా వాహనం నడపడం కూడా ఓ కారణంగా మారుతోందని అధికారులు పేర్కొంటున్నారు. వీటికితోడు నగరంలోని రహదారుల్లో ఉన్న ఇంజినీరింగ్‌ లోపాలు, డ్రైవర్ల నిద్రమత్తు సైతం ప్రమాద హేతువులుగా మారుతున్నాయి. సిటీలో వంపులు లేకుండా ఉన్న రహదారులను వేళ్ళ మీద లెక్కట్టొచ్చు. అందులోనూ అనేక బాటిల్‌నెక్స్‌ అనేకం. ఇవన్నీ ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. 

డ్రైవింగ్‌ అంటే ‘ఆ మూడే’ అని...
ఇటీవల కాలంలో నగరంలో కార్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రజల జీవన ప్రమాణాలతో పాటు సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌ పెరగడం, ఫైనాన్సింగ్‌ విధానాలు ఇలా అనేక కారణాల నేపథ్యంలో కార్లు కొనుగోలు చేస్తున్న వారు ఎక్కువగానే ఉంటున్నారు. వీరంతా ప్రాథమికంగా వివిధ డ్రైవింగ్‌ స్కూళ్ళల్లోనో, పరిచయస్తుల వద్దో డ్రైవింగ్‌ నేర్చుకుంటున్నారు. ఆ సమయంలో వీరి దృష్టంతా స్టీరింగ్, క్లచ్, బ్రేక్‌ల పైనే ఉంటోంది. ఈ మూడింటినీ నిర్వహించగలిగితే ఎక్కడైనా వాహనం నడుపవచ్చని భావిస్తుంటారు. అయితే హఠాత్పరిణామాలు, మార్జిన్స్, ఓవర్‌ టేకింగ్‌ తదితర సందర్భాల్లో తీసుసుకోవాల్సిన జాగ్రత్తలపై వీరికి పూర్తి స్థాయిలో పట్టు ఉండట్లేదు. దీంతో ‘ఆ మూడు’ నేర్చుకుని రోడ్ల పైకి వస్తున్న వాహనచోదకులు అనేక సందర్భాల్లో ప్రమాదాలకు లోనుకావడంతో పాటు కారకులుగానూ మారుతున్నారు. 

లైసెన్స్‌ జారీ విధానాల్లోనూ లోపాలెన్నో..
దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ డ్రైవింగ్‌ లైసెన్సులు జారీ వ్యవహారం లోపభూయిష్టంగా ఉంది. ఎల్‌ఎల్‌ఆర్‌ జారీ చేయడానికి ముందు నిర్వహించే కంప్యూటర్‌ పరీక్ష తూతూ మంత్రంగా సాగుతోంది. దీని తర్వాత ట్రాక్‌ టెస్ట్‌ జరుగుతుంది. ఇప్పటికే ఏ కేంద్రంలోనూ సాకేంతిక పరిజ్ఞానంతో ట్రాక్‌ టెస్ట్‌ చేసే సామర్ధ్యం లేదు. కేవలం మాన్యువల్‌గా మాత్రమే, కేవలం కొన్ని అంశాలనే తనిఖీ చేస్తున్నారు. లైసెన్సులు జారీ చేసే విధానంలో లోపాల కారణంగా డ్రైవింగ్‌పై పూర్తి పట్టులేని వారికీ లైసెన్సులు వచ్చేస్తున్నాయి. వీరిలో కొందరు క్యాబ్‌ డ్రైవర్లు కూడా ఉంటున్నారు. ఇలాంటి డ్రైవర్ల కారణంగా తరచు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్ని పూర్తిగా మార్చి, లోపాలను సరి చేయడంతో పాటు నిబంధనల్నీ కఠినతరం చేస్తేనే ప్రమాదాలను నిరోధించే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.  

2018 గణాంకాలిలా...
మొత్తం ప్రమాదాలు: 2540
తేలికపాటి వాహనాల వల్ల జరిగినవి: 849 (38 శాతం)
ఫోర్‌ వీలర్స్‌ వారు బాధితులుగా మారినవి: 62 (2 శాతం)

సిటీలో స్పీడ్‌ లిమిట్స్‌ ఇలా:
నగరంలో వాహనాల వేగ పరిమితులకు సంబంధించి సిటీ పోలీసులు 2010 జనవరి 8న నోటిఫికేషన్‌ జారీ చేశారు. దాని ప్రకారం..
ఆటోలు, ఆటో ట్రాలీలు తదితరాల గరిష్ట వేగం గంటకు 35 కిమీ
కార్లు, తేలికపాటి వాహనాలు, ద్విచక్ర వాహనాలకు గంటకు 50 కిమీ
భారీ వాహనాలు, సరుకు రవాణా వాహనాలు, మినీ బస్సులకు గంటకు 40 కిమీ
ట్యాంక్‌బండ్‌పై అన్ని రకాల వాహనాల గరిష్టంగా గంటకు 40 కిమీ మించి పోకూడదు.
పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్‌ వేపై తేలికపాటి వాహనాల గరిష్టంగా గంటకు 80 కిమీ, మధ్య తరహా వాహనాలు 65 కిమీ మించి పోకూడదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement