వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ : భారీ ఊరట

WhatsApp New Feature Lets YouChoose Who Can Add You to Groups - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మేసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ త్వరలో మరో బ్రహ్మాండమైన సదుపాయాన్ని వినియోగదారులకు అందించబోతోంది. ఎప్పటికప్పుడు యాప్‌ను అప్ డేట్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకొనే వాట్సాప్ బీటా వెర్షన్ తాజాగా ఓ కొత్త  ఫీచర్‌ను అందించబోతోంది.

ముఖ్యంగా ఒకే మెసేజ్‌ను పది గ్రూపుల ద్వారా తిప్పి తిప్పి వందసార్లు రిసీవ్‌ చేసుకుంటూ.. విసిగెత్తిపోతున్న వాట్సాప్‌ యూజర్లకు(ఇష్టం లేకపోతే ఆయా గ్రూపులనుండి  బయటకు వచ్చే అవకాశం ఉన్నా) ఇది నిజంగా మంచి ఊరట నిచ్చే ఫీచరే.  ఎందుకంటే  ఏదైనా గ్రూపులో చేరాలా వద్దా? అనేది  ఇకపై వాట్సాప్‌  వినియోగదారుల చేతుల్లోనే ఉండబోతోంది. ఎవరు బడితే వారు, గ్రూపుల్లో యాడ్‌ చేయకుండా నియంత్రించేలా వాట్సాప్‌ మూడు ఆప‍్షన్లను తీసుకురాబోతోంది. 

వాబేటా ఇన్ఫో.కాం అందించిన సమాచారం ప్రకారం ఇన్విటేషన్‌ ఫీచర్‌ను జోడించనుంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ బిజెనెస్‌లో అమలు చేస్తుండగా..అదనపు భద్రత కోసం వాట్సాప్‌లో కూడా తీసుకు రాబోతోంది. తమను  గ్రూప్స్‌లో  ఎవరు జోడించవచ్చో  స్వయంగా యూజర్లే ఎంచుకోవడానికి అనుమతించే ఫీచర్‌ అన్నమాట.  దీని ప్రకారం ప్రైవసీ సెటింగ్స్‌లో మూడు ఆప్లన్లు  ఉంటాయి.

1. నోబడీ :  ఎవరికీ మిమ్మల్ని గ్రూపులో  జోడించే అవకాశం  ఉండదు
2. మై కాంటాక్ట్స్‌ : కాంటాక్ట్స్‌లో ఉన్న వారు మాత్రమే యూజర్‌ను గ్రూపులో యాడ్‌ చేసేందుకు అనుమతినివ్వడం
3. ఎవ్రీవన్‌ :  అంటే  యూజర్‌ పరిచయం లేకపోయినా,  కాంటాక్ట్స్‌లో లేకపోయినా  గ్రూపులో యాడ్‌ చేసేలా అనుమతినివ్వడం.

ఈ ఫీచర్ త్వరలో వాట్సాప్ బీటాకి పరిచయం మవుతుందని భావిస్తున్నారు. అలాగే ప్రస్తుతం టెస్ట్‌ వెర్షన్‌ కూడా అందుబాటులో  ఉంది, ఆసక్తి  వున్నవారు దాన్ని ప్రయత్నించవచ్చట. అయితే బగ్స్‌ ఎటాక్‌, క్రాష్‌లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటే,  ఈలింక్‌పై  క్లిక్‌ చేసి టెస్టింగ్‌ ప్రోగ్రాం నుంచి  వైదొలగవచ్చని వాబేటా అందించిన రిపోర్టులో నివేదించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top