
రిలయన్స్ జియో దెబ్బకి టెలికాం మార్కెట్లో నెలకొన్న తీవ్రమైన ధరల యుద్ధం, మరోవైపు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ ప్రభావం.. వొడాఫోన్ గ్రూప్ పీఎల్సీ ఇండియా యూనిట్ను భారీగానే దెబ్బతీస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో కంపెనీ ఆపరేటింగ్ లాభాలు 39 శాతం పతనమయ్యాయి. సెప్టెంబర్ 30తో ముగిసిన ప్రథమార్థంలో ఈబీఐటీడీఏల అనంతరం ఆదాయం రూ. 4,075 కోట్లకు పడిపోయింది. గతేడాది ఇదే కాలంలో ఇవి రూ.6,704 కోట్లగా ఉందని వొడాఫోన్ ఇండియా తెలిపింది. ఈబీఐటీడీఏ మార్జిన్లు 29.6 శాతం నుంచి 21.4 శాతానికి పడిపోయాయని, అదేవిధంగా సర్వీస్ రెవెన్యూ కూడా 16 శాతం క్షీణించి రూ.19,002 కోట్లగా నమోదైనట్టు రిపోర్టు చేసింది.
గతేడాది రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మార్కెట్లోకి ప్రవేశించిన అనంతరం ఉచిత వాయిస్ ఆఫర్లు, డేటా ధరల కోత వంటి వాటితో ఇతర ఆపరేటర్లను ముప్పు తిప్పలు పెడుతోంది. రిలయన్స్ జియో దెబ్బకు తమ మార్జిన్లు పడిపోతున్నా... తన కస్టమర్లను కాపాడుకోవడం కోసం ఇంక్యుబెంట్ ఆపరేటర్లు కూడా ఆఫర్ల వర్షం కురిపిస్తున్నారు. జియోతో పోటీ కోసం మరోవైపు టెలికాం రంగంలో విలీనాలు భారీ ఎత్తున్న జరుగుతున్నాయి. వొడాఫోన్ ఇండియా కూడా ఐడియా సెల్యులార్ లిమిటెడ్లో విలీనం కాబోతుంది. మరోవైపు జీఎస్టీ ప్రభావం కూడా టెలికాం మార్కెట్పై ప్రభావం చూపుతుంది. టెలికాం రంగానికి 18 శాతం జీఎస్టీ విధిస్తుండటంతో, ఇప్పటికే నష్టాల్లో టెలికాం పరిశ్రమపై మరింత భారాన్ని పెంచుతుంది. సోమవారం వొడాఫోన్ ఇండియా తన స్టాండలోన్ టవర్ వ్యాపారాలను అమెరికన్ టవర్ కార్పొరేషన్కు రూ.3,850 కోట్లకు అమ్మడానికి సోమవారం ఆమోదం తెలిపింది.