మాల్యాకు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ | Vijay Mallya Arrest Ordered In Fresh Money-Laundering Case Charge-Sheet | Sakshi
Sakshi News home page

మాల్యాకు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌

Jun 21 2018 9:08 AM | Updated on Aug 20 2018 4:35 PM

Vijay Mallya Arrest Ordered In Fresh Money-Laundering Case Charge-Sheet - Sakshi

సాక్షి, ముంబై: భారీ రుణ ఎగవేతదారుడు,లిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఇడి) దాఖలు చేసిన తాజా ఛార్జిషీట్  నేపథ్యంలో ముంబై ప్రత్యేక కోర్టు  అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది.  నగదు బదిలీ కేసులో  కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంఎస్ ఆజ్మి ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. అనంతరం ఈ కేసు విచారణను  జులై 30వ తేదీకి వాయిదా వేశారు. మనీ లాండరింగ్ చట్టం కింద 6వేల కోట్ల రూపాయల బ్యాంకు మోసం కేసులో  విజయ్ మాల్యా సంస్థలైన కింగ్‌ ఫిషర్ ఎయిర్లైన్స్ (కెఎఫ్ఎ), యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (యుహూహెచ్ఎల్)పై ఈడీ   తాజాగా చార్జిషీట్‌ దాఖలు చేసింది.  దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు ఈ సంస్థలకు   కూడా సమన్లు ​​జారీ చేసింది.

రూ.6,000 కోట్ల మేర బ్యాంకుల కన్సార్షియంను మోసగించారంటూ విజయ్‌ మాల్యాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాజాగా మరో చార్జిషీటు వేసిన సంగతి విదితమే. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ముంబైలోని ప్రత్యేక కోర్టులో ఈడీ ఇది దాఖలు చేసింది.  2005-10 మధ్య కాలంలో రుణ వాయిదాల చెల్లింపులు జరపకపోవడం వల్ల రూ.6,027 కోట్ల మేర నష్టపోయిన కేసుకు సంబంధించి ఎస్‌బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియం చేసిన ఫిర్యాదు మేరకు ఈడీ తాజాగా చార్జి షీటు దాఖలు చేసింది.

కాగా కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ ఐడీబీఐ బ్యాంకు నుంచి తీసుకున్న రూ. 900 కోట్ల ఎగవేత కేసుకు సంబంధించి మాల్యాపై ఈడీ గతేడాది తొలి చార్జిషీటు వేసింది. ఈ కేసులో ఇప్పటిదాకా రూ. 9,890 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. అటు ఉద్దేశ పూర్వక ఎగవేతదారుడుగా   భావిస్తున్న మాల్యా దేశం విడిచి లండన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement