ఐదేళ్లలో రూ.49,000 కోట్లు
రానున్న ఐదేళ్లలో గుజరాత్లో పలు వ్యాపార ప్రాజెక్టులపై రూ.49,000 కోట్లను పెట్టుబడులుగా వినియోగిస్తామని, ప్రత్యక్షంగా...
• వైబ్రంట్ గుజరాత్ సదస్సులో గౌతమ్ అదానీ ప్రకటన
• రిలయన్స్ తరఫున 2 లక్షల మందికి ఉపాధి: ముకేశ్ అంబానీ వెల్లడి
గాంధీనగర్ (గుజరాత్):రానున్న ఐదేళ్లలో గుజరాత్లో పలు వ్యాపార ప్రాజెక్టులపై రూ.49,000 కోట్లను పెట్టుబడులుగా వినియోగిస్తామని, ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి కల్పిస్తామని అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు. పోర్టుల సామర్థ్య విస్తరణతోపాటు, నీరు, సిమెంట్ వ్యాపారాల్లో ఈ నిధుల వినియోగం ఉంటుందన్నారు. రూ.5,500 కోట్లతో సిమెంట్ క్లింకర్ ప్లాంటు, రూ.2,000 కోట్లతో సముద్ర నీటి నిర్జలీకరణ ప్రాజెక్టులు చేపడతామని చెప్పారు. గుజరాత్లోని గాంధీనగర్లో జరుగుతున్న ఎనిమిదవ వైబ్రంట్ గుజరాత్ అంతర్జాతీయ సదస్సులో ప్రముఖ పారిశ్రామిక వేత్తలైన ముకేశ్ అంబానీ, రతన్Sటాటా, గౌతమ్ అదానీలు తమ ప్రాజెక్టుల్లో గుజరాత్కు అగ్ర ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. అదానీ పోర్ట్స్ గుజరాత్లో ముంద్రా, దహేజ్, హజీరా, అజీరా, తునా పోర్టులను నిర్వహిస్తోంది. వీటి విస్తరణకు రూ.16,700 కోట్లు వెచ్చిస్తామని గౌతమ్ అదానీ వెల్లడించారు. ముంద్రా, అజీరాలో రూ.1,200 కోట్లతో వంటనూనెల తయారీ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తామన్నారు.
రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు: ముకేశ్
గుజరాత్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రిఫైనరీ, పెట్రోకెమికల్ విస్తరణ ప్రాజెక్టులపై రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యాన్ని ఈ ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ తెలిపారు. తాము ప్రకటించిన మొత్తానికంటే ఇది రూ.10,000 కోట్లు అధికమన్నారు. దేశాన్ని మార్చే గొప్ప నేతగా ప్రధాని మోదీని ఆయన ప్రస్తుతించారు. తొలుత ఆయన గుజరాత్ను మార్చారని, తర్వాత విడతల వారీ చర్యలతో దేశాన్ని మార్చే పని చేపట్టారని పేర్కొన్నారు. ఇంత తక్కువ వ్యవధిలో ఇంత మంది ప్రజల మైండ్సెట్ను మార్చిన నేత మరొకరు లేరన్నారు. ‘‘గుజరాత్లో మా మొత్తం పెట్టుబడులు రూ.2,40,000 కోట్లు. ఒక రాష్ట్రంలో ఒక దేశీయ కంపెనీ చేసిన అతి పెద్ద పెట్టుబడి ఇదే. ఇందులో చివరి నాలుగేళ్ల కాలంలోనే రూ.1,25,000 కోట్లను వెచ్చించాం. నిజానికి చెప్పినదానికంటే మరో రూ.10,000 కోట్లు ఎక్కువే పెట్టుబడి పెట్టాం’’ అని ముకేశ్ పేర్కొన్నారు. అంతేకానీ కొత్త పెట్టుబడుల గురించి ఆయన చెప్పలేదు. తమ పెట్టుబడులతో మొత్తం మీద 2 లక్షల మందికి స్థిరమైన ఉపాధి కల్పించామన్నారు.
నానోతో కార్ల హబ్గా మారింది: రతన్ టాటా
టాటా చిన్న కారు నానో ప్రాజెక్టుతో గుజరాత్ కార్ల తయారీ కేంద్రంగా మారిందని టాటా గ్రూపు తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా అన్నారు. ‘‘కొన్నేళ్ల క్రితం అదృష్టం కొద్దీ కార్ల తయారీ కేంద్రాన్ని గుజరాత్కు మార్చే అవకాశం నాకు లభించింది. మోదీ నాయకత్వంలో (అప్పుడు గుజరాత్ సీఎం) గుజరాత్ కార్ల తయారీకి హబ్గా మారింది’’ అని రతన్ చెప్పారు. టాటా గ్రూపు చైర్మన్ పదవిని కోల్పోయిన సైరస్ మిస్త్రీ నష్టాలతో కూడిన నానో ప్రాజెక్టును కొనసాగించడాన్ని తప్పుబట్టిన విషయం తెలిసిందే.


