వినియోగదారుడి ఆమోదం తప్పనిసరి  | UIDAI clarification on gas subsidy transfer | Sakshi
Sakshi News home page

వినియోగదారుడి ఆమోదం తప్పనిసరి 

Dec 20 2017 12:43 AM | Updated on Dec 20 2017 12:43 AM

UIDAI clarification on gas subsidy transfer - Sakshi

న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌ తరహా ఉదంతాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆధార్‌ నిర్వహణ సంస్థ యూఐడీఏఐ రంగంలోకి దిగింది. వంటగ్యాస్‌ సిలిండర్లపై సబ్సిడీనీ కస్టమర్ల ఖాతాకు కేంద్ర ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సబ్సిడీ జమ చేసుకోవడానికి ముందుగానే ఖాతాదారుల ఆమోదం తప్పకుండా తీసుకోవాలని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. సబ్సిడీ జమకు సంబంధించి మార్పు చోటు చేసుకుంటే ఆ విషయాన్ని ఖాతాదారులకు వెంటనే 24 గంటల్లోపు ఎస్‌ఎంఎస్, ఈమెయిల్‌ ద్వారా తెలియజేయాలని, అవసరమైతే పూర్వపు ఖాతాకు మార్చుకునే అవకాశం కూడా కల్పించాలని ఆదేశిస్తూ యూఐడీఏఐ ఓ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎస్‌ఎంఎస్, ఈమెయిల్‌ లేని ఖాతాదారుల నుంచి సబ్సిడీ జమ విషయమై లిఖిత పూర్వకంగా ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏ బ్యాంకు ఖాతాకు చివరిగా ఆధార్‌ అనుసంధానించుకుంటే ఆ ఖాతాలో వంటగ్యాస్‌ సబ్సిడీ జమ అవుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో యూఐడీఏఐ ఈ చర్యలు తీసుకుంది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) సబ్సిడీ పొందే అకౌంట్ల మార్పు అభ్యర్థనను ఖాతాదారుల ఆమోదంతో బ్యాంకుల నుంచి వస్తేనే అనుమతించాలని నోటిఫికేషన్‌లో యూఐడీఏఐ పేర్కొంది. ఈ విషయమై యూఐడీఏఐ సీఈవో అజయ్‌ భూషణ్‌ పాండే సమాధానమిస్తూ వినియోగదారుల ఆమోదం లేకుండా బ్యాంకు ఖాతాలను మార్పు చేయడాన్ని నిలిపివేసేందుకే మరింత సురక్షిత విధానాన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు. దీని ప్రకారం బ్యాంకులు ఖాతాదారుల ఆమోదం తీసుకున్న అనంతరమే సబ్సిడీ జమ చేయాల్సిన ఖాతాల మార్పు అభ్యర్థలను ఎన్‌పీసీఐకు పంపించాల్సి ఉంటుందని పాండే తెలిపారు. ఒకవేళ కొత్త ఖాతాలకు సబ్సిడీ జమ చేయడం వినియోగదారులకు ఇష్టం లేకపోతే దాన్ని రివర్స్‌ చేసుకునే సదుపాయాన్ని ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.   

‘ఎయిర్‌టెల్‌’ అనుభవంతోనే 
భారతీ ఎయిర్‌టెల్‌ తన ఖాతాదారుల ఆమోదం లేకుండానే వారి పేరిట భారతీ ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకులో ఖాతాలు తెరిచి ఆధార్‌తో అనుసంధానించుకోవడం ద్వారా వారి వంటగ్యాస్‌ సబ్సిడీలను జమ చేసుకున్నట్టు వెలుగు చూడడంతో ఇదో పెద్ద వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. రూ.190 కోట్ల మేర సబ్సిడీ మొత్తం ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో యూఐడీఏఐ ఏకంగా ఎయిర్‌టెల్, ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకుకు ఆధార్‌ ఈకేవైసీ ధ్రువీకరణ అధికారాన్ని నిలిపివేసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే యూఐడీఏఐ తాజా ఆదేశాలు జారీ చేసింది.   

రూ. 2.5 కోట్ల పెనాల్టీ కట్టిన ఎయిర్‌టెల్‌ 
న్యూఢిల్లీ: పేమెంట్స్‌ బ్యాంక్‌లో అనధికారికంగా ఖాతాలు తెరిచిన వివాదానికి సంబంధించి ఎయిర్‌టెల్‌ సంస్థ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థకు (యూఐడీఏఐ) మధ్యంతర జరిమానా కింద రూ. 2.5 కోట్లు కట్టింది. కంపెనీ బేషరతుగా ఈ మొత్తాన్ని డిపాజిట్‌ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 31 లక్షల కస్టమర్ల ఖాతాల్లో జమయిన రూ. 190 కోట్ల గ్యాస్‌ సబ్సిడీ మొత్తాన్ని కూడా 24 గంటల్లోగా వారి అసలు ఖాతాల్లోకి బదిలీ చేస్తామని ఎయిర్‌టెల్‌ హామీ ఇచ్చినట్లు వివరించాయి.  ఎయిర్‌టెల్‌కి పేమెంట్స్‌ బ్యాంక్‌ కూడా ఉంది. మొబైల్‌ కనెక్షన్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ కోసం కస్టమర్ల నుంచి ఆధార్‌ వివరాలను సేకరించిన ఎయిర్‌టెల్‌.. అనుమతి తీసుకోకుండానే వారి పేరిట పేమెంట్స్‌ బ్యాంక్‌లో కూడా ఖాతాలు తెరిచిందని ఆరోపణలున్నాయి. ఆ యూజర్లకు రావా ల్సిన గ్యాస్‌ సబ్సిడీ మొత్తాలు కూడా ఈ ఖాతాల్లోకి చేరడం వివాదానికి దారి తీసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన యూఐడీఏఐ.. ఎయిర్‌టెల్‌కి ఇచ్చిన ఈ–కేవైసీ లైసెన్సును తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement