చిన్న సంస్థలకు ఊతం.. | Sakshi
Sakshi News home page

చిన్న సంస్థలకు ఊతం..

Published Sat, Feb 2 2019 1:07 AM

 Top of the list: MSMEs look for easier access to loans in Budget 2019 - Sakshi

న్యూఢిల్లీ: కోట్లాది మందికి ఉపాధి కల్పించే లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎస్‌ఎంఈ) తోడ్పాటునిచ్చేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోందని ఆర్థిక మంత్రి పియుష్‌ గోయల్‌ చెప్పారు. ఇటీవలే 59 నిమిషాల్లోనే రూ. 1 కోటి దాకా రుణాల పథకాన్ని ప్రారంభించామని, జీఎస్‌టీలో నమోదు చేసుకున్న ఎస్‌ఎంఈలకు రూ. 1 కోటిపైగా రుణాలపై రెండు శాతం మేర వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక రూ. 5 కోట్ల కన్నా తక్కువ వార్షిక టర్నోవరు ఉన్న 90 శాతం మంది జీఎస్‌టీ చెల్లింపుదారులు ఇకపై మూణ్నెల్లకోసారి రిటర్నులు దాఖలు చేసేలా నిబంధనలు సడలిస్తున్నామన్నారు. మరోవైపు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇక నుంచి 25 శాతం కొనుగోళ్లు ఎస్‌ఎంఈల నుంచే జరపాల్సి ఉంటుందని, ఇందులోనూ 3 శాతం కొనుగోళ్లు మహిళల సారథ్యంలోని సంస్థల నుంచి కొనాల్సి ఉంటుందని  చెప్పారు.  

రూ. 17వేల కోట్ల లావాదేవీలు.. 
ప్రభుత్వ శాఖలు, సంస్థల ఆన్‌లైన్‌ కొనుగోళ్ల కోసం ఉద్దేశించిన గవర్నమెంట్‌ ఈ–మార్కెట్‌ప్లేస్‌ (జీఈఎం) పోర్టల్‌ ద్వారా గడిచిన రెండేళ్లలో రూ. 17,500 కోట్ల పైచిలుకు లావాదేవీలు జరిగాయని గోయల్‌ చెప్పారు. వీటితో 25–28 శాతం మేర ఆదా అయ్యిందని ఆయన వివరించారు. ప్రస్తుతం ఈ పోర్టల్‌లో 1,90,226 మంది విక్రేతలు, సర్వీస్‌ ప్రొవైడర్లు 7,53,162 పైగా ఉత్పత్తులను విక్రయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.  
రూ. 7 లక్షల కోట్ల ముద్ర రుణాలు.. 

మోదీ సర్కారు ముద్ర స్కీమ్‌ను ప్రవేశపెట్టినప్పట్నుంచీ రూ. 7.23 లక్షల కోట్ల విలువ చేసే 15.56 లక్షల రుణాలు మంజూరైనట్లు గోయల్‌ చెప్పారు. లబ్ధిదారుల్లో మహిళల సంఖ్య 70 శాతం పైగానే ఉందని ఆయన పేర్కొన్నారు. 

Advertisement
Advertisement