భారత మార్కెట్లోకి థాయ్‌ రిటైల్‌ సంస్థ

Thai retail company into Indian market - Sakshi

రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్న సియామ్‌ మాక్రో

ఢిల్లీలో ఈ ఏడాది రెండు హోల్‌సేల్‌ స్టోర్ల ఏర్పాటు!

న్యూఢిల్లీ: థాయ్‌లాండ్‌కి చెందిన రిటైలింగ్‌ సంస్థ సియామ్‌ మాక్రో పీసీఎల్‌... తాజాగా భారత హోల్‌సేల్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. వచ్చే అయిదేళ్లలో భారత క్యాష్‌ అండ్‌ క్యారీ విభాగంలో రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు సంస్థ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ సిరిపోర్ణ్‌ డెక్‌సింఘా తెలిపారు. లాట్స్‌ హోల్‌సేల్‌ సొల్యూషన్స్‌ పేరిట ఈ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారామె.ఈ ఏడాది ఢిల్లీ నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌లో  తొలుత రెండు స్టోర్లు ఏర్పాటు చేస్తామని, ప్రధానంగా ఉత్తరాదిపై దృష్టి సారించి వచ్చే మూడేళ్లలో 15 హోల్‌సేల్‌ స్టోర్లను ఏర్పాటు చేస్తామని డెక్‌ సింఘా తెలిపారు.

ప్రత్యక్షంగా, పరోక్షంగా 5,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆమె తెలియజేశారు. భారత మార్కెట్‌ తమకు చాలా కీలకమన్నారు. 50 బిలియన్‌ డాలర్ల భారీ దిగ్గజం కెరోయిన్‌ పాక్‌ ఫండ్‌ (సీపీ) గ్రూప్‌లో సియామ్‌ మాక్రో పీసీఎల్‌ భాగంగా ఉంది. 100% ఆటోమేటిక్‌ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానంలో సియామ్‌ మాక్రో భారత్‌లో ఇన్వెస్ట్‌ చేస్తోం ది. థాయ్‌లాండ్‌తో పాటు కంబోడియాలో కూడా ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. బ్యాంకాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న సీపీ గ్రూప్‌నకు అగ్రి బిజినెస్, టెలికం, ప్లాస్టిక్స్, ఆటోమోటివ్, ఫార్మాస్యూటికల్‌ తదితర వ్యాపారాలు కూడా ఉన్నాయి.

తమ స్టోర్స్‌ కోసం ప్రధానంగా స్థానిక మార్కెట్ల నుంచే సోర్సింగ్‌ (కొనుగోళ్లు) జరపనున్నట్లు లాట్స్‌ హోల్‌సేల్‌ సొల్యూషన్స్‌ ఎండీ తనిత్‌ చెరవనంత్‌ తెలిపారు. కిరాణా షాపులు, వ్యాపార సంస్థల కోసం ఆన్‌లైన్‌లో కూడ విక్రయించనున్న ట్లు, షాపు దగ్గరికే డెలివరీ సర్వీసులు కూడా అం దించనున్నట్లు చెప్పారు. కిరాణా షాపులకు రుణ సదుపాయంతో ఉత్పత్తులు అందించేలా ఆర్థిక సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top