7 రోజుల రికార్డు పరుగు!
రూపాయి ఒకేరోజు 77 పైసలు అప్
70.69 వద్ద ముగింపు
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ పటిష్ట రీతిన బలపడుతోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్లో గురువారం ఒకేరోజు 77 పైసలు లాభపడి 70.69 వద్ద ముగిసింది. రూపాయి రికవరీ బాటన పయనించడం వరుసగా ఇది ఏడవరోజు. ఈ కాలంలో భారీగా 220 పైసలు లాభపడింది. బ్యాంకర్లు, ఎగుమతిదారులు డాలర్లను భారీగా విక్రయించడం కొనసాగిస్తున్నారు. గురువారం రూపాయి ప్రారంభం తోటే 71.12 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 70.68 వద్దకూ రికవరీ అయ్యింది. మంగళవారం రూపాయి ముగింపు 71.46. బుధవారం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సెలవు.
బలోపేతానికి కారణాలు..
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరల భారీ పతనం, విదేశీ నిధుల ప్రవాహం కొనసాగుతుండటం వంటి అంశాలు రూపాయి బలోపేతానికి తక్షణ కారణాలు. అంతర్జాతీయ వృద్ధి మందగమనానికి అవకాశం ఉందని అమెరికా ఫెడ్ తాజా వ్యాఖ్యలు, దీనితో రెండు వారాల గరిష్ట స్థాయి నుంచి కిందకు జారిన డాలర్ ఇండెక్స్ రూపాయి సెంటిమెంట్ను బలపరుస్తున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ వ్యూహకర్త ఆనంద్ జేమ్స్ అభిప్రాయపడ్డారు.