రోజారీ బయోటెక్‌ ఐపీవోకు యాంకర్‌ నిధులు | Rossari biotech raises anchor funds | Sakshi
Sakshi News home page

రోజారీ బయోటెక్‌కు యాంకర్‌ నిధులు

Jul 11 2020 12:22 PM | Updated on Jul 11 2020 12:26 PM

Rossari biotech raises anchor funds - Sakshi

కోవిడ్‌-19 సవాళ్ల నేపథ్యంలోనూ ఐపీవోకు వస్తున్న రోజారీ బయోటెక్‌ తాజాగా యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించింది. వారాంతాన 15 యాంకర్‌ ఇన్వెస్టర్‌ సంస్థలకు 35 లక్షలకుపైగా షేర్లు కేటాయించడం ద్వారా రూ. 149 కోట్లు సమకూర్చుకుంది. అబుదభి ఇన్వెస్ట్‌మెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్, యాక్సిస్‌ ఎంఎఫ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎంఎఫ్‌, ఎస్‌బీఐ ఎంఎఫ్‌, సుందరం ఎంఎఫ్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ తదితర సంస్థలు షేరుకి రూ. 425 ధరలో ఇన్వెస్ట్ చేశాయి. రూ. 2 ముఖ విలువతో వస్తున్న రోజారీ బయోటెక్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 13న(సోమవారం) ప్రారంభమై 15న(బుధవారం) ముగియనుంది. ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 423-425.

గ్లాండ్‌ ఫార్మా సైతం
మార్చి 16న ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్ పేమెంట్స్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాక పబ్లిక్‌ ఇష్యూలు నిలిచిపోయాయని విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే రోజారీ బయోటెక్ ఇందుకు తిరిగి శ్రీకారం చుడుతోంది. కాగా.. హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ గ్లాండ్‌ ఫార్మా సైతం తాజాగా ఐపీవో ప్రణాళికలు ప్రకటించింది. రూ. 6,000 కోట్ల సమీకరణకు అనుమతించమంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది. కోవిడ్‌-19 కారణంగా ఇటీవల పలు కంపెనీలు ఐపీవోలు చేపట్టేందుకు వెనుకాడుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐపీవో ద్వారా ఎస్‌బీఐ కార్డ్స్‌ రూ. 10,000 కోట్లు సమీకరించిన విషయం విదితమే. 

35 షేర్లకు.
పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రోజారీ బయోటెక్ రూ. 494-496 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 35 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే రూ. 2 లక్షల విలువ మించకుండా ఏకమొత్తంగా దరఖాస్తు చేయవచ్చు. ఐపీవో నిధులను ప్రధానంగా రుణ చెల్లింపులతోపాటు.. వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది.  ఇష్యూలో భాగంగా 1.05 కోట్ల షేర్లతోపాటు తాజాగా రూ. 50 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇష్యూ విజయవంతంగా పూర్తయితే..  ఈ నెల(జులై) 23కల్లా రోజారీ బయోటెక్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 

3 విభాగాలలో
రోజారీ బయోటెక్‌ ప్రధానంగా మూడు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. గృహ పరిశుభ్రత, వ్యక్తిగత సంరక్షణ(హోమ్‌, పెర్సనల్‌ కేర్‌) ప్రొడక్టులతోపాటు.. పెర్ఫార్మెన్స్‌ కెమికల్స్‌నూ తయారు చేస్తోంది. టెక్స్‌టైల్‌ స్పెషాలిటీ కెమికల్స్‌ను రూపొందిస్తోంది. అంతేకాకుండా జంతు సంరక్షణ, బలవర్ధక ఉత్పత్తులు(యానిమల్‌ హెల్త్‌, న్యూట్రిషన్‌ ప్రొడక్ట్స్‌)ను తయారు చేస్తోంది. కంపెనీ ఉత్పత్తులను సబ్బులు, డిటర్జెంట్లు, పెయింట్లు, టైల్స్‌, పేపర్‌, టెక్స్‌టైల్స్‌ తదితర రంగాలలో వినియోగిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు వివరించాయి. కంపెనీకి హెచ్‌యూఎల్‌, ఐఎఫ్‌బీ ఇండస్ట్రీస్‌, అరవింద్‌ తదితర దిగ్గజ కంపెనీలు కీలక కస్టమర్లుగా నిలుస్తున్నాయి. అయితే కంపెనీ కార్యకలాపాలు కలిగిన రంగాలలో ఆర్తి ఇండస్ట్రీస్‌, గలాక్సీ సర్ఫెక్టాంట్స్‌, వినతీ ఆర్గానిక్స్‌ తదితర లిస్టెడ్‌ కంపెనీలు ప్రధాన ప్రత్యర్దులుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

2020లో ఇలా
గతేడాది(2019-20)లో రోజారీ బయోటెక్‌ రూ. 604 కోట్ల ఆదాయం సాధించింది. ఇబిటా రూ. 104 కోట్లను అధిగమించగా.. నికర లాభం రూ. 65 కోట్లను తాకింది. కంపెనీ ఉత్పత్తులను గృహ, వ్యక్తిగత సంరక్షణ ప్రొడక్టుల తయారీలో వినియోగిస్తున్నందున నిత్యావసర కేటగిరీలోకి చేరుతుందని యాక్సిస్‌ క్యాపిటల్‌ పేర్కొంది. దీంతో సిల్వస్సాలోని ప్లాంటు కోవిడ్‌-19 లాక్‌డవున్‌లోనూ తయారీని కొనసాగించినట్లు తెలియజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement