
ముంబై : టెలికాం రంగంలో ప్రగతి పథంలో దూసుకుపోతున్న బిలీనియర్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ జియోకాయిన్ పేరుతో మరో సంచలనానికి తెరతీయబోతున్న సంగతి తెలిసిందే. జియో కాయిన్ పేరుతో సొంతంగా ఈ క్రిప్టోకరెన్సీని సృష్టిస్తున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే రిలయన్స్ జియోకు మార్కెట్లో ఉన్న క్రేజ్ను బట్టి, జియో కాయిన్ పేరుతో నకిలీ వెబ్సైట్ ఒకటి తెరపైకి వచ్చింది. రిలయన్స్-జియోకాయిన్.కామ్ అనే యూఆర్ఎల్తో ఈ వెబ్సైట్ లిస్ట్ అయింది. అచ్చం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మాదిరిగేనే ఈ వెబ్సైట్ దర్శనమిస్తోంది. ఐకాన్ కూడా జియో పేరెంట్ కంపెనీదే ఉండటం గమనార్హం.
దీనిలో ఒక్కో జియో కాయిన్ను వంద రూపాయలకు లాంచ్ చేయనున్నట్టు పేర్కొంది. పూర్తి పేరు, ఈ-మెయిల్ అడ్రస్తో రిజిస్టర్ అవ్వాలంటూ ఈ నకిలీ వెబ్సైట్ యూజర్లను తప్పుదోవ పట్టిస్తోంది. దీనిలో సమాచారం రాయడానికి కనీసం వెబ్సైటే ఓపెన్ అవడం లేదని తెలుస్తోంది. దీంతో ఇది నకిలీ వెబ్సైట్గా వెల్లడవుతోంది. ప్రజలు ఈ వెబ్సైట్తో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అవుతున్నాయి.
మింట్ రిపోర్టు ప్రకారం ఇటీవల కాలంలో క్రిప్టోకరెన్సీలకు ఎక్కువగా డిమాండ్ పెరుగుతుండంతో, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కూడా సొంతంగా జియో కాయిన్ పేరుతో క్రిప్టోకరెన్సీకి సృష్టిస్తుందని తెలిసింది. అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ సారథ్యంలో మొత్తం 50 మంది టీమ్ ఈ బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై పనిచేస్తున్నారని రిపోర్టు పేర్కొంది.