
న్యూఢిల్లీ: గోల్డ్ ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి నిధులు వెనక్కుమళ్లడం కొనసాగుతోంది. 2017లో గోల్డ్ ఫండ్స్ నుంచి రూ.730 కోట్ల ఉపసంహరణలు జరిగాయి. ఇలాంటి ధోరణి వరుసగా ఇది ఐదవ సంవత్సరం. భారతీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) తాజా నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే...
♦ 2016తో పోలిస్తే 2017లో గోల్డ్ ఫండ్స్ నిర్వహణలోని (ఏయూఎం–అసెట్ అండర్ మేనేజ్మెంట్) నిధులు 12 శాతం క్షీణించి రూ.4,855కు తగ్గాయి.
♦ మంచి రాబడులు వస్తున్న నేపథ్యంలో గడచిన ఐదేళ్లలో రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అధికంగా ఈక్విటీల్లో పెడుతున్నారు. గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులు తగ్గాయి.
♦ ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లోకి గత ఏడాది రూ.1.5 లక్షల కోట్ల మొత్తంరాగా, మ్యూచువల్ ఫండ్స్కీమ్ల్లోకి మొత్తంగా రూ.2.4 లక్షల కోట్లు వచ్చాయి.
♦ 2016లో ఈటీఎఫ్ల నుంచి బయటకు వెళ్లిన మొత్తం రూ.942 కోట్లు. 2017లో ఇలా బయటకు వెళ్లిపోయిన మొత్తం రూ.730 కోట్లు. 2015 (రూ.891 కోట్లు), 2014 (రూ.1,651 కోట్లు), 2013 (రూ.1,815 కోట్లు)లలో కూడా నిధులు ఈటీఎఫ్ల నుంచి బయటకు వెళ్లాయి. అయితే ఇలా బయటకు వెళుతున్న నిధుల పరిమాణం తగ్గుకుంటూ రావడం ఇక్కడ గమనార్హం.
♦ 2012లో ఈటీఎఫ్ల్లోకి రూ.1,826 కోట్లు వచ్చాయి. అటు తర్వాత నుంచి నికరంగా బయటకు నిధుల ప్రవాహం కొనసాగింది.
ఈక్విటీల ఆకర్షణ...
రియల్టీ, బంగారం అంత ఆకర్షణీయంగా కనిపించడం లేదు. సాంప్రదాయక పొదుపు పథకాల్లో కూడా వడ్డీరేట్లు తగ్గాయి. దీనితో ఇన్వెస్టర్లు ఈక్విటీలవైపునకు మొగ్గుచూపుతున్నారు.
– రాహుల్ పరేఖ్, సీఈఓ, బజాజ్ క్యాపిటల్