ఒకే గదిలో 114 కంపెనీలు.. | Over Hundred Companies Operate From One Room In Hyderabad | Sakshi
Sakshi News home page

ఒకే గదిలో 114 కంపెనీలు..

Jul 25 2018 4:27 PM | Updated on Sep 4 2018 5:53 PM

Over Hundred Companies Operate From One Room In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కంపెనీ అంటే భారీ కార్యాలయం, సిబ్బంది, బోర్డ్‌ రూమ్‌ ఇలాంటి హంగామాను ఎవరైనా ఊహించుకుంటారు. అయితే ఇందుకు భిన్నంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఓ మాల్‌లో కేవలం ఒకే గదిలో ఏకంగా 114 కంపెనీలు తమ కార్యాకలాపాలను సాగించడం విస్మయపరుస్తోంది. ఫార్చూన్‌ మొనార్క్‌ మాల్‌లోని మూడో ఫ్లోర్‌లో ఓ చిరునామాను వెతుక్కుంటూ వెళ్లిన ఎనిమిది మంది అధికారుల బృందం అక్కడి వ్యవహారం చూసి అవాక్కైంది. 114 కంపెనీలకు ఆ చిన్న గదే చిరునామా అయితే వీటిలో కనీసం 50 కంపెనీలు ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించకుండా రూ 8 కోట్ల నుంచి రూ 15 కోట్ల నష్టం చూపుతున్నాయి.

ఈ కంపెనీలు కేవలం నగదును కంపెనీల నడుమ సరఫరా చేసేందుకే ఏర్పాటైన షెల్‌ కంపెనీలుగా భావిస్తున్నారు. ఈ కంపెనీలకు వ్యవసాయ భూముల వంటి ఆస్తులున్నాయని, రిటన్స్‌ కూడా దాఖలు చేస్తున్నాయని అధికారులు గుర్తించారు. ఈ కంపెనీల డైరెక్టర్లు వేతనాలు కూడా తీసుకుంటున్నారు.

ఒక్కో డైరెక్టర్‌ 25 నుంచి 30 కంపెనీలను నడిపిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి 20 కంపెనీలకు మించి డైరెక్టర్‌గా వ్యవహరించరాదని అధికారులు చెబుతున్నారు. కాగా ఒకే చిరునామాపై 25కి మించి కంపెనీలు నడిచే ప్రాంతాలపై నిఘా పెట్టాలని ఢిల్లీ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకే ఈ దాడులు జరిగినట్టు సమాచారం. కాగా ఈ కంపెనీలన్నింటికీ ఎస్‌ఆర్‌ఎస్‌ఆర్‌ అడ్వైజరీ సర్వీస్‌ అనే సంస్థే అకౌంటెంట్‌గా వ్యవహరించడం గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement