సినిమా టికెట్ల ధరలు పెరుగుతాయ్‌! | Movie ticket prices are rising! | Sakshi
Sakshi News home page

సినిమా టికెట్ల ధరలు పెరుగుతాయ్‌!

Jun 22 2018 12:51 AM | Updated on Jul 11 2019 9:16 PM

Movie ticket prices are rising! - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గూడ్స్, సర్వీసెస్‌ ట్యాక్స్‌తో (జీఎస్‌టీ) రానున్న రోజుల్లో తమ రంగానికి కష్ట కాలమేనని సినీ పరిశ్రమ హెచ్చరిస్తోంది. 95 శాతం మంది నిర్మాతలు నష్టాలను చవిచూస్తున్నారని నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంపై జీఎస్‌టీ ప్రభావం అన్న అంశంపై అసోచాం, పీడబ్లు్యసీ గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నష్టాలు పొందుతున్న నిర్మాతలకు జీఎస్‌టీ అదనపు భారమేనని స్పష్టం చేశారు. ‘పన్నుతో నిర్మాతలకు 30% ఖర్చు పెరుగుతోంది. రూ.100 దాటిన టికెట్‌పై పన్ను 28 శాతముంది. అంటే రూ.150 టికెట్‌లో రూ.42 జీఎస్‌టీ ఉంది. ఇది పరిశ్రమకు అనుకూలం కాదు. త్వరలో రూ.100 టికెట్‌ కాస్తా రూ.150, రూ.150 విలువగలది రూ.200లకు చేరనుంది. థియేటర్లో లభించే ఫుడ్, బెవరేజెస్‌ సైతం ప్రియం కానున్నాయి. అంతిమంగా ఖర్చులు అధికం అవుతాయి కాబట్టి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుంది’ అని వెల్లడించారు.  

లగ్జరీ నుంచి తొలగించాలి.. 
సినిమాలను లగ్జరీగా పరిగణించరాదని అసోచాం ఎంటర్‌టైన్‌మెంట్, మీడియా నేషనల్‌ కౌన్సిల్‌ చైర్మన్, సారథి స్టూడియోస్‌ డైరెక్టర్‌ కె.వి.రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పన్ను విషయమై సమీక్షించాలని కోరారు. సినీ రంగంలో వందలాది మంది వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. ఈ రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వాలని పీడబ్లు్యసీ పార్టనర్‌ అనిత రస్తోగి డిమాండ్‌ చేశారు. దాదాపు 1.2 లక్షల ప్రతిపాదనల ఆధారంగా జీఎస్‌టీ రూపుదిద్దుకుందని మేడ్చల్‌ జీఎస్‌టీ కమిషనరేట్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్‌ తెలిపారు. పన్ను తగ్గింపు విషయంలో ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. కార్యక్రమంలో అసోచాం ప్రతినిధులు డీఎస్‌ రావత్, బి.శ్రీకాంత్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement