తెలుగులో సత్య నాదెళ్ల పుస్తకం ‘హిట్‌ రీఫ్రెష్‌’ | Microsoft CEO Satya Nadella interacts with employees in Hyderabad | Sakshi
Sakshi News home page

తెలుగులో సత్య నాదెళ్ల పుస్తకం ‘హిట్‌ రీఫ్రెష్‌’

Nov 7 2017 12:52 AM | Updated on Nov 7 2017 12:52 AM

Microsoft CEO Satya Nadella interacts with employees in Hyderabad - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ సీఈఓ, హైదరాబాద్‌ వాస్తవ్యుడైన సత్య నాదెళ్ల రాసిన ‘హిట్‌ రీఫ్రెష్‌’ పుస్తకం ఈ నెలాఖరులోగా తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. తెలుగుతో పాటూ హిందీ, తమిళం భాషల్లోనూ ఈ పుస్తకం మార్కెట్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. హిందీ ఎడిషన్‌ను హార్పెర్‌ కొల్లిన్స్‌ ఇండియా, తెలుగు, తమిళం ఎడిషన్లను వెస్ట్‌ల్యాండ్‌ బుక్స్‌ పబ్లిష్‌ చేయనున్నాయి.

గతేడాది సెప్టెంబర్‌ 26న ఇంగ్లిష్‌ విడుదలైన ఈ పుస్తకం ధర రూ.599. నాదెళ్ల ‘హిట్‌ రీఫ్రెష్‌’ పుస్తకంలో తన వ్యక్తిగత జీవితంతో పాటూ మైక్రోసాఫ్ట్‌లో తన ప్రయాణం, ఇతరత్రా అనుభవాలను రాశారు. పుస్తక ప్రచారం నిమిత్తం రెండు రోజుల పాటు దేశీయ పర్యటనకు వచ్చిన నాదెళ్ల సోమవారం హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్‌ అభివృద్ధి కేంద్రాన్ని సందర్శించారు. స్థానిక ఉద్యోగులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారని కంపెనీ వర్గాలు తెలిపాయి.

2014లో మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాదెళ్ల.. ఉద్యోగ అనుభవాలతో పాటూ సీఈఓగా ఎదిగిన ప్రయాణం గురించి ఉద్యోగులతో పంచుకున్నారని తెలిసింది. మంగళవారం ఢిల్లీలో జరగనున్న ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్‌ నెక్స్‌›్ట 2017’లో ముఖ్య అతిథిగా ప్రసంగిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement