గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) మధ్య న్యాయ పోరాటం మరింత ముదిరింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో సహా ఇతర అగ్రశ్రేణి ఎగ్జిక్యూటివ్లపై ఢిల్లీ-హరియాణా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) విధించిన జరిమానా ఉత్తర్వులను సవాలు చేస్తూ లింక్డ్ఇన్ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ను ఆశ్రయించింది.
మే 15, 2026న దాఖలైన ఈ అప్పీల్ను పరిశీలించిన ట్రైబ్యునల్ ఈ వివాదంపై తుది నిర్ణయం వచ్చే వరకు ఆర్ఓసీ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ (స్టే) మధ్యంతర ఉపశమనం కల్పించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. భారతదేశంలో పనిచేస్తున్న బహుళజాతి కంపెనీల (ఎంఎన్సీ) భవిష్యత్తుపై దీని ప్రభావం ఉండనుండటంతో లీగల్ సర్కిల్స్లో ఈ కేసు హాట్ టాపిక్గా మారింది.
అసలు వివాదం ఏమిటి?
లింక్డ్ఇన్ సంస్థ మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలో ఉంది. 2016లో సుమారు 26.2 బిలియన్ డాలర్ల డీల్తో మైక్రోసాఫ్ట్ దీనిని సొంతం చేసుకుంది. మైక్రోసాఫ్ట్ గ్లోబల్ సీఈఓగా సత్య నాదెళ్ల ఈ కార్పొరేట్ నిర్మాణంలో అగ్రస్థానంలో ఉండగా లింక్డ్ఇన్ సీఈఓ ర్యాన్ రోస్లాన్స్కీ మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ పరిధిలో పనిచేస్తున్నారు. అయితే, మే 5, 2024న జారీ చేసిన ఒక ఉత్తర్వులో లింక్డ్ఇన్ ఇండియా, లింక్డ్ఇన్ ఐర్లాండ్లతో పాటు సత్య నాదెళ్ల, ర్యాన్ రోస్లాన్స్కీలపై ఆర్ఓసీ రూ.27 లక్షల జరిమానా విధించింది. కంపెనీల చట్టం ప్రకారం వీరు ‘గణనీయమైన ప్రయోజనకరమైన యజమానుల’ (సిగ్నిఫికెంట్ బెనిఫిషియల్ ఓనర్స్-ఎస్బీఓ) నిర్వచనం కిందికి వస్తారని, అయితే ఈ వివరాలను దాచారని ఆర్ఓసీ పేర్కొంది.
లింక్డ్ఇన్ వాదన
లింక్డ్ఇన్ ఇండియా అనేది మైక్రోసాఫ్ట్ పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ. అయితే, మాతృ సంస్థలో ఏ ఒక్క నిర్దిష్ట వాటాదారుకూ గణనీయమైన వాటా లేదు. అందువల్ల ఎంసీఏ ఫైలింగ్స్లో తాము ‘శూన్య’ (నిల్) ఎస్బీఓలను ప్రకటించామని, చట్టాన్ని తాము ఉల్లంఘించలేదని లింక్డ్ఇన్ వాదిస్తోంది. ఈ వ్యవహారంపై స్పందన కోరుతూ పంపిన ఈమెయిల్స్కు లింక్డ్ఇన్, మైక్రోసాఫ్ట్ లేదా ఎంసీఏ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు.
ఎస్ఈసీ మాటేంటి..
ఈ వివాదంలో అత్యంత కీలకమైన అంశం.. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ముందు మైక్రోసాఫ్ట్ సమర్పించిన పత్రాలను ఆర్ఓసీ పరిగణనలోకి తీసుకోవడం. సత్య నాదెళ్లకు లింక్డ్ఇన్ ఇండియాపై నియంత్రణ ఉందనే నిర్ధారణకు రావడానికి, ఆయన ఎస్ఈసీకి సమర్పించిన ‘ఫారం 4ఎస్’ ఫైలింగ్స్ను ఆర్ఓసీ తన 63 పేజీల ఉత్తర్వులో ప్రధానంగా ప్రస్తావించింది. కంపెనీ అంతర్గత వ్యక్తులు (ఇన్సైడర్స్), డైరెక్టర్లు తమ వాటాల మార్పులను వెల్లడించడానికి అమెరికాలో ఈ ఫారం 4ఎస్ ఉపయోగిస్తారు.
బహుళజాతి కంపెనీలపై పడే ప్రభావం
భారతీయ చట్టాల ప్రకారం ప్రయోజనకరమైన యాజమాన్యాన్ని (ఎస్బీఓ) రెండు పరీక్షల ద్వారా గుర్తిస్తారు. షేర్హోల్డింగ్ టెస్ట్.. కంపెనీలో 10 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉండటం. నియంత్రణ టెస్ట్.. ప్రత్యక్ష వాటాతో సంబంధం లేకుండా కంపెనీ వ్యవహారాలపై గణనీయమైన ప్రభావం లేదా నియంత్రణను (వీటో హక్కులు వంటివి) కలిగి ఉండటం. ప్రస్తుత కేసులో ఆర్ఓసీ ఏ వాటాదారుకో కాకుండా, ఏకంగా గ్లోబల్ సీఈఓకు జరిమానా విధించడం గమనార్హం.
‘సీఈఓ విధి కంపెనీని నడపడమే. నిర్ణయాధికారాల కోసం వారికి కొన్ని అధికారాలు సహజంగానే ఉంటాయి. అంతమాత్రాన సీఈఓలు తీసుకునే ప్రతి నిర్ణయం ఎస్బీఓ నిబంధనల ప్రకారం ‘నియంత్రణ’ కిందికి రాదు’ అని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిపోయిన బంగారం ధరలు


